Sunday, April 28, 2024

పబ్‌లో గ్యాంగ్‌వార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి మాజీ డిజిపి, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్‌లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని జీరో పబ్ దగ్గర రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఇందులో ఏపీ మాజీ డిజిపి గౌతం సవాంగ్ కొడుకు డేవిడ్ సవాంగ్‌ది ఓ వర్గం. బుధవారం అర్థరాత్రి సమయంలో హంగామా నెలకొంది. యువతి విషయంలో సిద్ధార్థ గ్యాంగ్‌తో డేవిడ్ సవాంగ్ గ్యాంగ్ గొడవపడినట్టు సమాచారం. ఈ ఉదయం డేవిడ్ సవాంగ్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సిద్ధార్థ్ గ్యాంగ్‌పై ఫిర్యాదు చేశాడని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీరో-40 పబ్‌కి రాత్రి డేవిడ్ సవాంగ్ బ్యాచ్, సిద్ధార్థ మాగ్నమ్ అనే యువకుడి బ్యాచ్ వేర్వేరుగా వెళ్లినట్టు పొలీసులు చెప్తున్నారు. డేవిడ్ సవాంగ్ ప్రియురాలు కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. ఇప్పుడు సిద్ధార్థతో డేటింగ్ చేస్తోందట.

ఈ విషయంలో డేవిడ్ సవాంగ్, సిద్ధార్థ మధ్య చాలాసార్లు గొడవ జరిగినట్టు సమాచారం. రాత్రి జూబ్లీహిల్స్‌లోని జీరో-40 పబ్‌కు సిద్ధార్థ తన గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లాడు. డేవిడ్ సవాంగ్ కూడా అదే సమయంలో అదే పబ్‌కు వెళ్లాడు. డేవిడ్, సిద్ధార్థ ఒకరినొకరు ఎదురుపడటంతో మరోసారి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. డేవిడ్ బ్యాచ్‌లో ఐదుగురు ఉండగా, సిద్ధార్థ బ్యాచ్‌లో ఆరుగురు ఉన్నారు. సిద్ధార్థ బ్యాచ్‌లో ఒక నైజీరియన్ కూడా ఉన్నాడని చెబుతున్నారు. ఈ రెండు గ్రూపుల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. పబ్‌లో జరిగిన ఈ గొడవ బయటకు వచ్చిన తర్వాత ఎక్కువైందని తెలుస్తోంది. పబ్ బయట కూడా ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారని, మద్యం మత్తులో విచక్షణా రహితంగా కొట్టుకున్నారని సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థకు తీవ్రగాయాలయ్యాయి. డేవిడ్ సవాంగ్‌కు కూడా గాయలు అయినట్టు ప్రచారం జరుగుతోంది. జీరో-40 పబ్ దగ్గర బుధవారం అర్థరాత్రి ఈ గొడవ జరగగా గురువారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన డేవిడ్ సవాంగ్ సిద్ధార్థ్ గ్యాంగ్‌పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

దీంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గొడవపై ఆరా తీశారు. అసలు ఏం జరిగిందనే వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పటి పోలీస్ బాస్ సుపుత్రుడు ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ కావడం వివర్శలకు తావిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని, వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వొద్దని, పిల్లల ప్రతి కదలికను పేరంట్స్ గమనించాలంటూ చాలాసార్లు పోలీస్ బాస్‌లు స్పీచ్‌లు ఇస్తుంటారు. కానీ.. పోలీసు బాస్‌ల పిల్లల సంగతి ఏంటి..? వారు కూడా వారి పిల్లల విషయంలో ఇంతే జాగ్రత్తగా ఉంటున్నారా..? లేక… పక్కవారికి సూక్తులు చెప్పి… చేతులు దులుపుకుంటున్నారా..? మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు పబ్‌లో గొడవ చేయడం, దాడి చేయడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి ఘటనలు బయటపడినప్పుడు ప్రజల్లో ఇలాంటి ప్రశ్నలే తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News