న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ ఏట, తన రాజకీయ ఆద్యంతాల వేదిక అయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల దశలో తుదిశ్వాస విడిచారు. ఎప్పుడూ అనారోగ్యం దరిచేరని పాశ్వాన్ ఇటీవల కొంతకాలంగా జబ్బున పడుతూవస్తున్నారు. ఇటీవలే ఆయన చికిత్సకు ఢిల్లీ ఆసుపత్రిలో చేరగా అనూహ్య విషమ పరిస్థితి ఏర్పడటంతో గుండె శస్త్రచికిత్స జరిగింది. అయితే ఆయన పరిస్థితి పూర్తిగా దిగజారిందని, మృతిచెందారని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షులు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్లో గురువారం రాత్రి ప్రకటించారు. తండ్రి ఈ లోకంలో లేరని, అయితే ఆయన ఎక్కడ ఉన్నా తనతో పాటు ఉంటూ తనకు ఆశీస్సులు ఇస్తూ ఉంటారని చిరాగ్ పేర్కొన్నారు. ఐ మిస్యూ పప్పా అని భావోద్వేగం వ్యక్తం చేశారు. బీహార్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉనికిని చాటుకున్న ఎల్జెపిని పాశ్వాన్ పట్టుదలతో తీర్చిదిద్దుతూ వచ్చారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో తమ ప్రభుత్వాలను నిలదొక్కుకునేలా చేయడంలో పాశ్వాన్ ప్రముఖ పాత్ర పోషించారు. ఎనిమిదిసార్లు లోక్సభ సభ్యుడు అయిన పాశ్వాన్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు. దేశంలోని ప్రముఖ దళిత నేతలలో పాశ్వాన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
వ్యక్తిగత జీవితం …డిఎస్పి నేతవరకూ
బీహార్లోని ఖగారియా జిల్లా షాహర్బన్సిలో పాశ్వాన్ 1946 జులై 5వ తేదీన ఓ దళిత కుటుంబంలో జన్మించారు. పాట్నా వర్శిటీలో పిజి చేశారు. 1963లో డిఎస్పిగా ఎంపికయ్యారు. 1969లో సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ ప్రయాణం ఆరంభించారు. ఐదు దశాబ్దాలుగా రాజకీయాలలో సాగుతున్నారు. విపిసింగ్, దేవెగౌడ , ఐకె గుజ్రాల్ హయాంలలో మంత్రిగా చేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కీలక మంత్రిగా ఉన్నారు. 1974లో లోక్దళ్ స్థాపించిన తరువాత అందులో చేరారు. 75లో ఎమర్జెన్సీని ధిక్కరించి జైలుకు వెళ్లిన నేతలలో పాశ్వాన్ ముఖ్యులు . జైలు నుంచి విడుద తరువాత 1977లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచి విజయంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. 2000 సంవత్సరంలో లోక్జనశక్తి పార్టీని స్థాపించారు. జార్జి ఫెర్నాండెజ్, రాజ్నారాయణ్ వంటి ఎమర్జెన్సీ వ్యతిరేక నేతలతో పాటు పాశ్వాన్ కూడా చిరస్థాయిగా చరిత్రలో నిలుస్తారని రాజకీయ స్పందనలు వెలువడ్డాయి. పాశ్వాన్ మరణం పట్ల పలువురు ప్రముఖ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పాశ్వాన్ తమ గట్టి కృషి, అంకితభావంతో రాజకీయాలలో ఎదిగారని ప్రధాని మోడీ తెలిపారు. యువనేతగా ఉన్నదశలో అప్పట్లో దేశంలో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ప్రతిఘటించారని కొనియాడారు. చిరాగ్కు పాశ్వాన్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇతర నేతలు కూడా పాశ్వాన్ మృతికి సంతాపం తెలిపారు.
Union minister Ram Vilas Paswan passed away