Saturday, April 27, 2024

అమెరికా విద్య ఎవరి కోసం?

- Advertisement -
- Advertisement -

విద్యా సంస్థలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పీడిత సమాజానికి బాధ్యత వహించాలి, పాలకులకు కాదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, విద్యా సంస్థలు రాజకీయులను తృప్తిపర్చాలంటున్నారు. విద్యార్థులకు అనుకూలం కాని, తల్లిదండ్రులు ఇష్టపడని విద్యా విధానాలను, ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసే ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. బళ్ళ పెట్టుబళ్ళకు, సాధించే ఫలితాలకు ప్రతిఫలంగా వాటి ఫీజులు ఉండాలని, తల్లిదండ్రులు ఎక్కువ ఫీజులు చెల్లించడానికి సిద్ధపడాలని అధ్యక్షుని మద్దతుదారులు వాదిస్తున్నారు. విద్యా బోధనలో విద్యార్థుల, తల్లిదండ్రుల పాత్రను తొలగించారు. విద్యావేత్తలు ప్రజలకు కాక ప్రభుత్వానికి బాధ్యత వహించాలనే చట్టాలను ఇష్టపడుతున్నారు.
నిధులను ప్రైవేటు విద్యా సంస్థలకు మళ్లించడం ద్వారా ప్రజా విద్యా వ్యవస్థ పునాదులను పెకలించవచ్చు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పెట్టుబళ్లకు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే ప్రతి శిశువుకు న్యాయమైన విద్య అందుతుంది. అందుకే విద్యా వోచర్లను నేను వ్యతిరేకిస్తున్నాను అని 2020 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బిడెన్ ప్రచారం చేశారు. అమెరికా బళ్ళలో విద్యార్థులకు ప్రభుత్వ నిధులనిచ్చే ధ్రువపత్రం విద్యా వోచర్ లేదా స్కూల్ వోచర్. పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడానికి సంఘాలు, డెమొక్రాట్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బిడెన్ మద్దతుదారు వాషింగ్టన్ పోస్టు దినపత్రిక సంపాదకవర్గం గతేడాది ప్రశ్నించింది. సమాఖ్య ప్రభుత్వ ఉపకార వేతనాలు ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రభుత్వ నిధులతో నడిచే ప్రైవేటు బళ్ళ (ఛార్టర్ స్కూల్స్) కోసం బిడెన్ పట్టుపట్టారు.

ప్రభుత్వ విద్యా సంస్థలకు సమాఖ్య నిధులనిచ్చే ప్రభుత్వ నియమాలను బిడెన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రైవేటు విద్యాసంస్థలపై పోటీలో ప్రభుత్వ విద్యాసంస్థల ఆధిపత్య అవకాశానికి గండికొట్టింది. విద్యా వోచర్ల, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రత్యామ్నాయ విధానాలకు అడ్డంకులు సృష్టిస్తోంది. విద్యా వ్యవస్థ నిర్వహణలో, విద్యా ఫలితాలలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్రను పెంచింది. బిడెన్ విద్యా నియమాలు ప్రైవేటు విద్యా సంస్థల చొరబాటుకు అవకాశమిచ్చాయి. ఆర్థిక బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకతలపై కొత్త నిబంధనలతో దృష్టి కేంద్రీకరించాము. సామూహిక అవసరాల సంగణీకరణ (డిజిటలైజేషన్) ను ఈ క్రమబద్ధీకరణలు సమర్థిస్తాయి. మా చట్టాలు ఛార్టర్ స్కూల్ రంగాన్ని నాశనం చెయ్యవు అని ఛార్టర్ స్కూల్ ఇన్‌స్టిట్యూషన్ కాన్ఫరెన్స్‌లో అమెరికా విద్యా విభాగ సహాయ కార్యదర్శి (మంత్రి) రాబర్టొ రోడ్రిగ్జ్ బ్రూకింగ్స్ వివరించారు.

ఛార్టర్ స్కూల్స్, సమాఖ్య విద్యా వ్యవస్థ ఇతర ప్రత్యామ్నాయాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. 16.6% తల్లిదండ్రులు గతేడాది పిల్లలకు కొత్త పాఠశాలలను ఎన్నుకున్నారు. 11.3% ఆ ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది 25.8% ఆ పనిలో ఉన్నారు అని నేషనల్ స్కూల్ ఛాయిస్ అవేర్నెస్ ఫౌండేషన్ తన 2023 జనవరి సర్వేలో ప్రకటించింది. 53.7% తల్లిదండ్రులు పిల్లలను కొత్త బళ్ళలో చేర్చారు లేదా ఆ పనిలో ఉన్నారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసంలో విద్యా సంస్థల జవాబుదారీతనంపై నిరంతర నిఘా పెడుతున్నారు. పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యామ్నాయ విద్యా సంస్థలను ఎంచుకుంటున్నారు. 45.6% తల్లిదండ్రులు ఇళ్లకు దగ్గరలో ఉన్న సంప్రదాయ ప్రభుత్వ బళ్ళను, 38.2 % తమ జిల్లాకు, ప్రాంతానికి వెలుపల ఉన్న ప్రభుత్వ పాఠశాలలను, 31.5% ఛార్టర్ స్కూళ్ల ను, 29.1% ప్రైవేటు, మతాధార బళ్లను ఎంచుకున్నారని, 22.9% ఇళ్లలోను, 20.8% ఆన్‌లైన్ తరగతులలో, 4% మైక్రో స్కూలింగ్ లేదా పాడ్ లర్నింగ్‌లో పిల్లలను చదివించారని సర్వే నివేదిక తెలిపింది. (15 లోపు విద్యార్థులు ఉండే మన ఏకోపాధ్యాయ పాఠశాలలను పోలిన బళ్ళను అమెరికాలో మైక్రో స్కూలింగ్ లేదా పాడ్ లర్నింగ్‌అంటారు) సామూహిక అవసరాలను తెలుసుకోడానికి తల్లిదండ్రులు సంగణీకరణ నిపుణులను ఆశ్రయించలేదు. తమ అవసరాలను గుర్తించారు. సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వారి లో పలువురు ఎక్కువ ఎంపిక అవకాశాలను కోరుకున్నారు. 48.1% తల్లిదండ్రులు, 52.8% హిస్పానిక్ (స్పానిష్ భాష మాట్లాడే అమెరికన్లు) తల్లిదండ్రులు, 53.4% మిలెన్నియల్ (1980- 90ల మధ్య పుట్టిన వైతరం) తల్లిదండ్రులు, తమ సమూహాలు, కుటుంబ అవసరాలకు తగినట్లు పిల్లలకు విద్యావకాశాలు సమకూర్చడం లేదన్నా రు. 3.7% తల్లిదండ్రులు మాత్రమే తమ సమూ హం ఎక్కువ విద్యావకాశాలను అందిస్తోందన్నారు.

ఎక్కువ విద్యావకాశాల కోరిక, పిల్లలను మెరుగయిన బళ్ళకు మార్చడం వంటివి విద్యా విభాగంపై అపనమ్మకం, తమ సమూహ అవసరాల అవగాహనలకు ఉత్తమ సంకేతాలు. కుటుంబ ప్రాధాన్యతలకు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని కోరడం అహంకారం కాదు. తల్లిదండ్రులు పిల్లల చదువులకు పాఠశాలలను ఎంచుకొని మార్చడంలో అనేక ప్రాతిపదికలను పరిగణించడం అసాధారణ ఆలోచన. 2018- 19 విద్యా సంవత్సరంలో 36% విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువులకు చాలా పాఠశాలలను పరిశీలించారు. వీరిలో 79% మంది ఉపాధ్యాయుల, ప్రధానాచార్యుల, పాఠశాల సిబ్బంది నాణ్యత ప్రధానమని భావించారు. 71%, విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ ముఖ్యమన్నారు. 59% మంది విద్యా సంబంధ కార్యక్రమాలు, బోధనాంశాలపై దృష్టి పెట్టారు. 30% ఇతర పాఠశాలలు మంచివని అభిప్రాయపడ్డారు. పాఠశాలల పని తీరుపై స్థిరం గా, నిరంతరం కొనసాగే పునః పరిశీలన జవాబుదారీతనం అధ్యయనంలో అభిలషనీయమయిన అంశం. తమ పిల్లల చదువులు చక్కగా ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. వారు చదువుతున్న పాఠశాలలు గృహ కేంద్రాలా, ప్రైవేటువా, ప్రభుత్వానివా, ఛార్టర్ స్కూల్లా అని పెద్దగా పట్టించుకోరు. అందుకే 70% ప్రజలు బైడెన్ జిత్తులమారి విద్యా నియమాలకు మద్దతు పలుకుతున్నారు. విద్యా వోచర్లకు, ఉపకార వేతనాలకు తాము సృష్టించే అడ్డంకులు జవాబుదారీతనం కోసమని రాజకీయులు వాదిస్తున్నారు. అయితే ఈ అడ్డంకులు జవాబుదారీతనానికి తెడ్డెయ్యడానికే గాని పెంచడానికి కాదు. నిజమయిన జవాబుదారీతనాన్ని ఎన్నికల ప్రక్రియలో ప్రజలే నిర్ణయించగలరు. విద్యావేత్తలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రజలకు బాధ్యత వహించాలి. ప్రభుత్వాధినేతలకు కాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News