బల్దియా ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన అధికార పార్టీ
ఇచ్చిన వాగ్దానం అమలు చేసేందుకు అధికారులతో చర్చలు
యాజమానులకు ఇకా నుంచి నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు
గ్రేటర్ పరిధిలో రోజు 460ఎంజిడిల వాటర్ సరఫరా
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందడుగు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ డివిజన్లు టిఆర్ఎస్ దక్కించుకోవడంతో ముందుగా ఉచిత నీటి సరఫరా వాగ్దానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం సంబంధించిన అధికారులు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఉచితంగా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఎంత భారమైన ప్రజలకు రోజుకు 22వేల లీటర్లు సకాలంలో సరఫరా చేసి, ఇకా నుంచి నెలవారీ బిల్లులు వసూలు చేయమంటున్నారు. మహానగరంలో 22 డివిజన్ల పరిధిలో 10.40లక్షల నల్లా కనెక్షన్లుండగా వాటి ద్వారా రోజుకు 460ఎంజిడిల వాటర్ను క్రమం తప్పకుండా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నెలకు నల్లా బిల్లులు రూ. 120 కోట్లు వసూలు చేసినట్లు ఈనెల నుంచి ఆ వసూలు లేవంటున్నారు. వాటర్బోర్డు నెలకు రూ. 160కోట్లు ఖర్చు వస్తుండగా, నెలకు రూ. 40కోట్లవరకు భారమైన నీటి సరఫరా చేశామని, త్వరలో పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తుందని డివిజన్లకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు.
అదే విధంగా పెండింగ్ బిల్లులు కూడా రూ. 800 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటిఎస్ పథకం ద్వారా రూ. 220 కోట్ల వరకు వసూలుచేసినట్లు బోర్డు పేర్కొంటుంది.అదే విధంగా కేశవాపూర్ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో పూర్తి చేసి, భవిష్యత్తులో నగరంలో నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటున్నారు. ఇటీవల కురిసిన వానలకు గ్రేటర్ పరిధిలో ఉన్న జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పదేళ్ల తరువాత పూర్తిగా నిండాయి. దీంతో రెండేళ్లవరకు ఈరెండు ప్రాజెక్టులు నీరందిస్తాయి. కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీటికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వేసవిలో ఈరెండు ప్రాజెక్టులు నగర దాహార్తిని తీర్చాయి. ఈఏడాది మాత్రం అలాంటి ఇబ్బందులులేవని అధికారులు వెల్లడిస్తున్నారు. నాణ్యతతో కూడిన ఉచిత నీటి సరఫరా చేస్తామని, దీనిపై ప్రజలు ఎలాంటి అనుమానం చెందాల్సిన పనిలేదంటున్నారు.
అదే విధంగా కొత్త పైపులైన్లు, దెబ్బతిన వాటి చోట మరమ్మత్తులు చేపట్టనున్నట్లు, లైన్మెన్ల సంఖ్య పెంచి, ఇప్పటివరకు ఏవిధంగా సరఫరా చేస్తామో అదే స్దాయిలో అందరికి సమయానికి సరఫరా చేస్తామని జలమండలి అధికారులు వివరిస్తున్నారు. దేశంలోనే ఏ మహానగరంలో ఉచితంగా మంచినీటి సరఫరా లేదని, ఆఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని, సర్కార్ నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా సక్రమంగా ఉంటే ప్రజల అన్ని అవసరాలు తీర్చినట్లేనని బస్తీ,కాలనీ సంఘాలు నాయకులు పేర్కొంటున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ పీఠం దక్కించుకుని మరో ఐదేళ్లు అభివృద్ది మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు.