Monday, April 29, 2024

అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేం

- Advertisement -
- Advertisement -

అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సిఎం శ్రద్ధాంజలి

మనతెలంగాణ/హైదరాబాద్ : అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని పేర్కొన్నారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని చెప్పారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు సిఎం కెసిఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆశయాలు సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్ బచావో..- జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్దితో మనం అమలు చేయాలని, సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలని తెలిపారు.
ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం
హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022 హైదరాబాద్‌కు దక్కిందని అన్నారు. అభివృద్ది ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయమని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నామని, అందుకే మనతో పాటు భవిష్యత్తు తరాలు కూడా ఈ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని కొనియాడారు. హరిత తెలంగాణ కోసం మన లక్షిత పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News