Sunday, April 28, 2024

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తాం

- Advertisement -
- Advertisement -

నిరసనల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు
రైతు జెఎసికి మంత్రి కెటిఆర్ హామీ

మనతెలంగాణ/హైదరాబాద్ : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కామారెడ్డి రైతు జెఎసి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతుల జెఎసి ప్రతినిధుల బృందం శనివారం మంత్రి కెటిఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కెటిఆర్… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు. గతంలోనే రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని, ఈ విషయంపై డిటిసిపి అధికారులతో మాట్లాడి.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. అలాగే రైతు జెఎసి నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను సైతం సానుకూలంగా పరిశీలించి.. ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసుల వివరాలను కెటిఆర్ స్థానిక జిల్లా ఎస్‌పితో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ఈ అంశంపై డిజిపి అంజనీకుమార్‌తోనూ మాట్లాడారు. మంత్రి కెటిఆర్ హామీపై పూర్తి భరోసా ఉందని రైతు జెఎసి తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు రైతు జెఎసి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News