Monday, April 29, 2024

మహిళా రైతులదే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా భూమి మీద వ్యక్తిగత ఉమ్మడి హక్కులను గుర్తిస్తూ మహిళల జీవనాధార హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద పరిశ్రమల నిర్మాణములో భూమిని కోల్పోయిన ఆదివాసీ మహిళా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి జీవనోపాధి కల్పించాలి. మహిళా రైతులకు సహకార సంఘాలుగా ఏర్పడాలి. సహకార మార్కెటింగ్ ఏర్పరచి సుస్థిర వ్యవసాయం వైపు మహిళా రైతులను ప్రోతాహించాలి.

దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిసున్నది. వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వ్యవసాయం ప్రజల జీవన విధానం. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి. 2011 ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో 18% వ్యవసాయ రంగం నుండి వస్తున్నది. తాజా గణాంకాల ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 84% మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో 33 శాతం రైతులు కాగా 47% మంది రైతు కూలీలుగా పని చేస్తున్నారు. 2009లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 94% మహిళా కూలీలు ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల ఉత్పత్తిలో పని చేస్తున్నారు.

3.72. శాతం మంది పండ్లు, గింజలు, పానీయాలు, మసాలా దినుసుల పంటల ఉత్పత్తిలో పని చేస్తున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, కోతకోయడం, కుప్పలు ఎత్తడం, కలుపు వేయడం మొన్నగు వ్యవసాయ పనుల్లో మహిళలు ఎక్కువ శాతం పని చేస్తున్నారు. దేశ జనాభాలో సగ భాగం వున్న మహిళలు వ్యవసాయ రంగంలో మూడో వంతు భాగస్వామ్యం కలిగి వున్నప్పటికీ మహిళలను రైతులుగా అంగీకరించడం లేదు. 2010- 12 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం సాగులో వున్న భూమిలో మహిళా రైతులు సాగు చేస్తున్న భూమి 13%, తెలంగాణలో 34% భూములను మహిళలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ కూలీలలో 57 శాతం మహిళలు వున్నారు. భారత దేశంలో 74% గ్రామీణ మహిళా శ్రామికులు వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. మహిళా రైతులు పురుషులతో సమానంగా పని చేసినప్పటికీ వారిని రైతులుగా పరిగణించడం లేదు.

మహిళలకు చట్టపరంగా సమాన ‘ఆస్తి హక్కు’ వుంది. కానీ ఎక్కడా ఆచరణకు నోచుకోకపోవడం వల్ల మహిళా రైతులు తమ హక్కులను అనుభవించడం లేదు. విధానపరమైన చర్చల్లో గాని, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలో గాని మహిళా రైతులు భాగస్వామ్యం కావడం లేదు. వ్యవసాయానికి పెట్టుబడి ప్రధాన సమస్య. మహిళా రైతులకు సంస్థాగత రుణాలు లభించడం లేదు. వీరికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వ అనాచరణ పథకాల ప్రకటనల వల్ల రుణాలు సకాలంలో అందక వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని చెల్లించలేని స్థితిలో చాలా మంది మహిళా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కెట్‌లో సౌకర్యాలు లేక, గిట్టుబాటు ధర లభించక తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. మార్కెట్‌లో ఆపద అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయి. మహిళా రైతులకు మార్కెట్ యార్డుల్లో విశ్రాంతి గదులు, టాయిలెట్ల సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.

శ్రమ దోపిడీ ఒక వైపు, మరో వైపు మహిళా రైతుల ఆత్మహత్యలు దేశంలో చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో దేశ వ్యాప్తంగా జరిగిన మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో వున్నది. ఆత్మహత్యలకు పాల్పడినవారిలో సన్నకారు, చిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని మార్కెట్‌కు వెళ్ళితే అనేక సాకులు చెప్పి ధాన్యాన్ని కొనకపోవడం మార్కెట్లో ఆహార ధాన్యాల భద్రత, రక్షణ నిలువ చేసుకునే సౌకర్యాలు లేక వర్షాలకు తడిసి ముక్క పట్టడం వల్ల తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి దాపురించింది. పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు వెళ్ళిన వెలిగొండకు చెందిన మహిళా రైతు పి రాజవ్వ, కరీంనగర్ జిల్లా సైదాపుర్‌లో బి గట్టవ్వ అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూపంపిణీ పథకాలలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ ప్రవేశపెట్టిన చట్టాల పట్ల మహిళా రైతులకు అవగాహన కలిగించాలి. భూమి మహిళా పేరుమీదకి రావడంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు సహకరించడం లేదు. భూమి యాజమాన్యం హక్కులు ఒకరి పేరు మీద వున్నా హక్కులను మరొకరి పేరు మీద నమోదు చేస్తున్నారు. దీని వల్ల భూమి వున్నా భూమి మీద పట్టాలేక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆర్థిక పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.మహిళా రైతులకు పట్టాలు ఇవ్వడం లేదు. భూమి చూపెట్టకపోవడం, వీరికి ఇచ్చిన భూమి హక్కులు సాగుకు అనుకూలంగా ఉండకపోవడం వల్ల చాలా మంది మహిళా రైతులు వ్యవసాయం మాను కుంటున్నారు. మహిళా రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు భూమికి సంబంధించిన రికార్డుల కాలంలో పురుషులతో పాటు వారి భార్య పేరు తప్పని సరి చేర్చాలి. మహిళల పేరు మీద వున్న భూములు విస్తీర్ణం, కమతాల సంఖ్య గుర్తించిన ప్రత్యేక సమాచారం పట్ల మహిళా రైతులకు అవగాహన లేదు. భూమికి సంబంధించిన రెవిన్యూ చట్టాల పట్ల అవగాహన కలిగించాలి.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సంబంధించిన మహిళా రైతులకు చట్టపరమైన అంశాల మీద పథకాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.మహిళలను విత్తన ఉత్పత్తిలో ఉద్యమదారులుగా ఎదిగేట్లు ప్రభుత్వాలు కృషి చెయ్యాలి. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల ఆగడాలను అరికట్టాలి. మహిళా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా రైతులకు అధునాతన వ్యవసాయ పని ముట్లను అందించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి శ్రామిక సామర్థ్యాన్ని పెంచి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపొందించే కార్యాచరణకు పూనుకోవాలి.

మహిళా రైతుల సంక్షేమ చర్యలు
1) ప్రభుత్వం మహిళలను రైతులుగా పరిగణించాలి. ప్రభుత్వం మహిళా రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన మహిళా రైతు బ్యాంకు ను ఏర్పాటు చెయ్యాలి. 2) వ్యవసాయ విధానాల రూపకల్పనలో మహిళా రైతులకు భాగస్వామ్యం కలిగించాలి. ఉద్యాన వనాల పెంపకంలో మహిళా రైతులకు, మహిళా రైతు కూలీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వం మహిళా రైతులకు, కూలీలకు ఉచిత వైద్య, ఉచిత ఆరోగ్య బీమా సహాయం అందించాలి. 3) న్యాయ సాధికార సంస్థ మహిళా రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి భూమి హక్కులు, రెవెన్యూ హక్కులుపై అవగాహన చైతన్యం కలిగించి మానవ హక్కుల రక్షణ అనువైన వాతావరణం ఏర్పరచాలి.

4) సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధానాన్ని, కనీస వేతనాలు పొందే అవకాశం మహిళా రైతులకు, రైతు కూలీలకు కల్పించాలి. 5) ప్రభుత్వం స్త్రీ, పురుషులకు సమాన ఓటు హక్కు కల్పించినట్లే మహిళా రైతులకు, రైతు కూలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 6) మహిళా రైతుల పేరు మీద జరిగిన భూపంపిణీ మొక్కుబడిగా జరిగింది. మహిళా రైతుల పేరు మీద భూమి హక్కులను స్పష్టంగా నమోదు చేయాలి. గ్రామ స్థాయి నుండి అన్ని స్థాయిల్లో భూమికి సంబంధించిన రికార్డ్ ఫహాని 1బి రిజిస్టర్ వ్యవసాయ దారిని కాలమ్‌లో పురుషులతో పాటు వారి భార్యల పేర్లు తప్పనిసరిగా నమోదు చేయాలి. భూమిపై టైటిల్ ఇవ్వాలి. 7) మార్కెట్ యార్డులో మహిళా రైతులకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యం కలిగించాలి. 8) మహిళా రైతులు తమకు తామే మహిళా స్వశక్తి పొదుపు సంఘాలుగా ఏర్పడి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సాధికారిత సాధనకు కృషి చేయాలి. 9) పామాయిల్, కొబ్బరి, మామిడి పండ్ల తోటలు పౌల్ట్రీల ఏర్పాటులో మహిళా రైతులకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం కలిగించాలి.

మహిళా రైతులకు, భూమిలేని అన్ని వర్గాల కార్మికులకు, ఒంటరి మహిళలకు అనువైన వ్యవసాయ విధానాలు, అవసరమైన పెట్టుబడులు నిర్దిష్ట కాలంలో తెలంగాణ ప్రభుత్వం అందించే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. వ్యవసాయ రంగంలో ఆత్మగౌరవంతో, హుందాగా కొనసాగటానికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చడంలో ప్రభుత్వం వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవసాయ అధికారులు మహిళా రైతుల సంక్షేమ కోసం చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకొని ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో మహిళా రైతులు క్రియాశీలక పాత్ర పోషించాలి. అప్పుడు మాత్రమే మహిళా రైతులకు ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం సాధ్యమై వ్యవసాయ రంగం ప్రగతి పథంలో పురోగమిస్తుంది.

నేదునూరి కనకయ్య
9440245771

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News