ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్కు చెందిన షేర్లు భారీగా పతనం కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ బ్యాంక్ పునరుద్ధరణకు చర్యలను వేగవంతం చేసింది. ఎస్ బ్యాంక్ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం ఆర్బిఐ ద్వారా పర్యవేక్షిస్తుందని, 2017 నుంచి ఎస్ బ్యాంక్ లావాదేవీలను ఆర్బిఐ సమీక్షిస్తోందని, 2019లో ఆ బ్యాంక్కు ఆర్బిఐ కోటి రూపాయల జరిమానా విధించిందని, ఎస్ బ్యాంకులో ఎస్బిఐ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని, ఈ అంశంపై ఆర్బిఐ గవర్నర్తో తాను మాట్లాడుతానన్నారు. సత్వర పరిష్కారం దిశగా ఆర్బిఐ కృషి చేస్తోందని నిర్మల భరోసా ఇచ్చారు. ఎస్ బ్యాంకు కస్టమర్లు 50 వేల రూపాయలు నగదు ఉపసంహరణ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎస్ బ్యాంకు సంక్షోభం గురించి 30 రోజుల్లో నివేదిక ఇస్తామని ఆర్ బిఐ చీఫ్ శక్తికాంతా దాస్ తెలిపాడు. దేశవ్యాప్తంగా ఎస్ బ్యాంక్ ఎటిఎంల ముందు భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఎస్ బ్యాంక్కు చెందిన షేర్లు భారీగా పతనం కావడంతో డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయడంలేదు, ఎస్ బ్యాంక్కు సంబంధం ఉన్న అన్ని యాప్స్ను నిలిపేశారు. గత రాత్రి నుంచి ఫోన్ పే యాప్ పని చేయడం లేదు, ఎస్ బ్యాంక్ స్వైపింగ్ మెషీన్స్ కూడా పని చేయకపోవడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.