Sunday, April 28, 2024

మీ తడిపార్ రాజకీయాలు ఇక్కడ చెల్లవు: అమిత్ షా పై వాసుదేవ రెడ్డి ధ్వజం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : “మిస్టర్ అమిత్ షా.. మీ తడిపార్ రాజకీయాలు ఇక్కడ చెల్లవు” అని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు. ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వాసుదేవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులను ఆదాని కంపెనీలకు బానిసలుగా చేసి అదాని ఆస్తులను పెంచడానికి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతల నడ్డి విరచాలని కుట్ర చేసింది బిజెపి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం పై ఆగ్రహంతో రైతులు ఏడాది కాలానికి పైగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చేసిన అసమాన పోరాటంతో తోకముడిచి దేశం రైతాంగానికి క్షమాపణలు చెప్పింది మీ నరేంద్ర మోడీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం వేదికగా మీరు మీ గోస వినిపించాలని అనుకున్నారు, కానీ మీ ప్రసంగాల్లో అన్నదాత బాగు కోసం చేసిన ప్రకటన ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు.

తెలంగాణలో అన్నదాతకు రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతును రాజును చేసి దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిందికెసిఆర్ ప్రభుత్వమని అన్నారు. రైతు రాజ్యం కోసం ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బిఆర్‌ఎస్ జెండా ఎత్తింది కెసిఆర్ అయితే, రైతును కార్పొరేట్లకు బానిసగా మార్చాలని కుట్ర చేసింది మోడీ ప్రభుత్వమని ఆరోపించారు. మీరెన్ని కుట్రలు పన్నినా.. ఢిల్లీ వైపు కెసిఆర్ అడుగులను నిలువరించలేరని స్పష్టం చేశారు. ఎవరు రైతుకు భరోసా ఇస్తున్నారో, ఎవరు రైతును కార్పొరేట్ వ్యవస్థకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారో దేశ ప్రజలకు తెలుసని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనడానికి నిరాకరించింది మోడీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రైతుల రెక్కల కష్టంతో పండించిన ధాన్యాన్ని పేద ప్రజలకు పంచకుండా దేశంలో వివిధ గోదాముల్లో ఉంచి నిరుపయోగంగా చేస్తున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమని ఆరోపించారు. చిల్లర-మల్లర రాజకీయాలతో అధికారం కోసం పిచ్చిపిచ్చి గా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్న విషయం తడిపార్ అమిత్ షా, తెలంగాణ తోలు కప్పుకున్న గుజరాత్ బానిసలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News