లక్నో: హత్రాస్ హత్యాచార ఘటనపై దర్యాప్తు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు నివేదికను సమర్పించడానికి ఇచ్చిన గడువును ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. దర్యాప్తు నివేదికను సమర్పించడానికి ఇచ్చిన గడువును మరో 10 రోజులు పొడిగించినట్లు ఉత్తర్ ప్రదేశ్ అదనపు ముఖ్య కార్యదర్శి(హోం) అవనీష్ కుమార్ అవస్థి బుధవారం మీడియాకు తెలిపారు. దర్యాప్తు పూర్తికాని కారణంగానే గడువును పొడిగించినట్లు ఆయన వివరించారు.
సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక 19 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేసేందకు యుపి ప్రభుత్వం సెప్టెంబర్ 30న సిట్ను ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో గడువును మరో 10 రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.