మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ చికిత్స మరింత వేగవంతంగా కొనసాగాలని ప్రభుత్వం నూతన వైద్యులను నియమిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 1191 రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డి రోనాల్డ్ రాస్ మంగళవారం జి.ఓను జారీ చేశారు. గాంధీ ఆసుపత్రికి 250 మంది, కింగ్కోఠి 100, టిమ్స్కు 150, చెస్ట్ ఆసుపత్రికి 50 మంది రెసిడెంట్ వైద్యులను ప్రభుత్వం తీసుకోనుంది. దీంతో పాటు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఒక్కో దానిలో 50 మంది చొప్పున, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్స్లో 241 మందిని తీసుకుంటామని అధికారులు సర్కూలర్ను జారీ చేశారు.
అయితే, వీరు ఒక సంవత్సకాలం పాటు ఈ పోస్టులో కొనసాగుతారని, వీరి నెల జీతం రూ.70వేలను ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలో వీరిని కాంట్రాక్ట్ బేసిక్గా మాత్రమే తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రెసిడెంట్ డాక్టర్ల కోర్సులోని థీరి, ప్రాక్టికల్ మార్కులను బట్టి ఈ నియామకాలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు రెసిడెంట్ వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక 227 సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కూడా ఆరు నెలలు గడువుతో నియమకాలు చేపడుతున్నట్లు డి రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. వీరిని హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో మాత్రమే తీసుకుంటామని ఆయన తెలిపారు. అయితే నెల వారీ జీతం మాత్రం ప్రకటించలేదు.
వైద్యవిధాన పరిషత్కు రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం..
వైద్యవిధాన పరిషత్ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం రూ.కోటి 16 లక్షల, 16వేల రూపాయలను విడుదల చేసింది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎమ్ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మినిస్ట్రేషన్ను అభివృద్ది చేసేందుకు ఈ నిధులను ఉపయోగించాలని ఆయన కోరారు.
1191 PG Physicians Notification for appointment in TS