ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ భాస్కర్ జాదవ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై 12మంది బిజెపి శాసనసభ్యులు ఏడాదిపాటు మహారాష్ట్ర శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. కాగా, ఈ ఆరోపణలను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్పీకర్ జాదవ్ వాదన ఏకపక్షంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం 12 మంది బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ కోరుతూ శాసనభ వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి వోటుతో సభ దీన్ని ఆమోదించింది. సస్పెన్షన్కు గురైన బిజెపి ఎమ్మెల్యేలు ఏడాది పాటు ముంబయి, నాగపూర్లోని అసెంబ్లీ ప్రాంగణాలలోకి ప్రవేశించడానికి వీల్లేదని పరబ్ ప్రకటించారు.
స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ జాదవ్ను దుర్భాషలాడింది శివసేన ఎమ్మెల్యేలైతే బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం తగదని ఫడ్నవీస్ అన్నారు. ఇది తప్పుడు ఆరోపణని, సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్యను తగ్గించడానికే ఈ ప్రయత్నమని ఆయన ఆరోపించారు. అయితే, తాను, శివసేన సభ్యులు కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని స్పీకర్ జాదవ్ డిమాండ్ చేశారు.
12 BJP MLAs Suspension in Maharashtra Assembly