పాక్ సైన్యం చేతిలో రెండు లక్షలమంది రేప్ బాధితులు
ఐక్యరాజ్యసమితి: డిసెంబర్ 9న ‘జాత్యాహంకార బాధితుల అంతర్జాతీయ దినం’ సందర్భంగా 1971 పాకిస్థాన్ యుద్ధంలో మరణించిన 30 లక్షలమంది బంగ్లా యోధులు, పౌరులు, అత్యాచారానికి గురైన రెండులక్షలమంది మహిళలకు నివాళులర్పించాలని భారత్ పిలుపునిచ్చింది. బాధితుల్లో అధికభాగం తూర్పు పాకిస్థాన్(బంగ్లాదేశ్)కు చెందినవారని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి ట్విట్ చేశారు. పాకిస్థాన్ సైన్యం, మతోన్మాద మిలిటెంట్లు కలిసి ఈ ఘాతుకాలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. బాధితుల సంఖ్యను 2017లో బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనా యుఎన్ అసెంబ్లీలో వెల్లడించారన్నది గమనార్హం. బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన యోధులకు భారత సైన్యం సంపూర్ణ మద్దతు ఇచ్చింది. 9 నెలలపాటు సాగిన ఆ యుద్ధంలో పాక్ మూకల్ని భారత సైన్యం తరిమికొట్టింది. వేలమంది పాక్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నది. అంతర్జాతీయ నిబంధనలమేరకు చివరికి విడిచిపెట్టింది.