Monday, April 29, 2024

ట్రంప్‌పై ముగ్గురు ఇండో అమెరికన్ల పోటీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్‌కు సమఉజ్జి అయిన పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగుతోంది. అయితే ఈ ఎన్నికల పోటీలో పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ను వెనకకు నెట్టివేసేందుకు భారతీయ సంతతికి చెందిన ముగ్గురు అమెరికన్లు పావులు కదుపుతున్నారు. అమెరికాను తిరిగి గ్రేట్‌గా నిలబెట్టాలంటే ట్రంప్ కాకుండా మరోక్కరు పార్టీ తరఫున అభ్యర్థిగా ముందుకు రావాల్సి ఉందని ప్రచారం సాగిస్తున్నారు. ట్రంప్‌పై పలు చట్టపరమైన వ్యాజ్యాలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ సొంత రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థి ఎంపిక రేస్‌లో ట్రంప్ వివిధ రౌండ్లలో ముందంజలో ఉన్నారు. అయితే ట్రంప్‌కు పోటీగా నిలిచేందుకు ముగ్గురు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి , నిక్కీ హేలీ, హిర్ష్ వర్ధన్ సింగ్‌లు వేర్వేరుగా తమ బలం సంతరించుకుంటున్నారు. వచ్చే ఏడాది జులై 15 నుంచి 18 వరకూ విస్కాన్సిన్‌లోని మిల్వావుకిలో జరుగుతాయి. ఈ దశలో ఈ ముగ్గురు పార్టీ తరఫున అభ్యర్థులుగా తమ నామినేషన్లకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. వీరు ముగ్గురు పార్టీలో ప్రాబల్యం ఉన్నవారే. ట్రంప్‌తో అమెరికా భవితకు సరైన దిశ ఉండదని, ఇప్పటి ఇంతకు ముందటి దశ తప్పుతుందనేది వీరి వాదన.
ఓటమి తెలియని నిక్కీ హెలీ
నిక్కీ హెలీ ఇంతకు ముందు ట్రంప్ ద్వారానే ఐరాసకు నియమితులైన అమెరికా తరఫున ఐరాసకు తొలి మహిళా రాయబారిగా నిలిచారు. సౌత్‌కరోలినా గవర్నర్‌గా కూడా అనుభవం ఉంది. రిపబ్లికన్ ప్రైమరీ పోటీలో నిలిచే ఏకైక మహిళ హేలీ అవుతారు. ఇంతకు ముందెప్పుడూ ఎన్నికలలో ఓటమి తెలియని ఈ 51 ఏండ్ల మహిళ తన శక్తిని తక్కువ అంచనావేయరాదని తరచూ చెపుతూ ఉంటారు. ట్రంప్ హయాంలో తన బాధ్యతల నిర్వహణ గురించి గర్వంగా తెలియచేసుకుంటూ ఉంటారు. అయితే అంతకు ముందు బాస్ అన్న ట్రంప్‌ను ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమె తెగడ్తలతో ముంచారు. ఎన్నికలలో అక్రమాలతో ఓటమి పాలయినట్లు ట్రంప్ చెప్పడాన్ని ఖండిస్తూ వచ్చారు. పార్టీ అంతర్గత అభిప్రాయ సేకరణలో ఆమెకు తక్కువస్థాయిలోనే ఇప్పటివరకూ మద్దతు దక్కింది. కానీ ఫండ్ సేకరణలో ఇప్పుడు 26 మిలియన్ డాలర్లతో పార్టీలో ఈ విషయంలో మిన్నగా నిలిచారు.
నెంబరు 3గా వివేక్ రామస్వామి
టెక్ పారిశ్రామికవేత్త అయిన వివేక్ రామస్వామి అనూహ్య రీతిలో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థి పోటీలో మూడోస్థానంలోకి చేరారు. ట్రంప్‌కు పోటాపోటీగా రెండోస్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ నిలిచారు. కాగా వెలుపలి వ్యక్తిగా ఫిబ్రవరిలోనే ఈ రేస్‌లోకి చేరిన రామస్వామి ఇప్పుడు ఈ ఇరువురి తరువాతి స్థానంలో దూసుకువచ్చారు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పటికే ఆయనకు 9 శాతం నేతల మద్దతు ఉంది. ట్రంప్ బలం 47 శాతంగా, రాన్ డిసాంటిస్ బలం 19 శాతానికి పైగా ఎగబాకుతూ ఉంది. కేరళ నుంచి రామస్వామి తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. 37 సంవత్సరాల రామస్వామి ఆరోగ్య పరిరక్షణ సంబంధిత ఔషధాల తయారీలో వినూత్న రీతిలో వ్యవహరిస్తూ ఈ రంగంలో భారీ స్థాయి మార్పునకు దారితీశారు. అమెరికా ఇంకా మందుల కోసం చైనాపై ఆధారపడకుండా చేసి తీరుతామని చెపుతున్నారు. తన ప్రచారం ఆరంభించిన నాటి నుంచి ఆయన సొంతంగా ఇతరత్రా 16 మిలియన్ డాలర్ల ఫండ్ రైజింగ్ చేపట్టారు. పార్టీలో తన ప్రాబల్యం చాటారు.
అమెరికా ఫస్ట్ నినాదంతో వర్థన్ సింగ్
భారతీయ సంతతికి చెందిన హిర్ష్‌వర్థన్ సింగ్ వృత్తిరీత్యా ఇంజనీరు. 38 ఏండ్ల ఈ భారతీయ సంతతి వ్యక్తి కూడా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరఫున రేస్‌లో చేరారు. అమెరికా ఫస్ట్ తన ప్రధాన నినాదం అని, దీని ద్వారానే అమెరికాను తిరిగి ప్రముఖ స్థానానికి తీసుకువెళ్లడం, అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తమ ట్విట్టర్ ద్వారా వీడియో సందేశం వెలువరించారు. న్యూజెర్సీ రిపబ్లికన్ పార్టీకి అనుబంధంగా ఆయన కన్సర్వేటివ్ వింగ్ ఏర్పాటు చేశారు. పార్టీలో ప్రెసిడెంట్ బరిలోకి దిగే క్రమంలో ఆయన వెలువరించిన వ్యాఖ్యలు సంచలనాత్మకం అయ్యాయి. తానొక్కడినే కోవిడ్ టీకాలకు నెత్తురు ఇవ్వని స్వచ్ఛమైన రక్తపు అభ్యర్థిని అని చాటుకున్నారు. ఇంతకు ముందు ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున పలు స్థాయిల్లో పదవులకు పోటీకి దిగి, ప్రైమరీ స్థాయిల్లోనే చతికిలపడ్డారు. న్యూజెర్సీ గవర్నర్ పదవికోసం 2017, తరువాత 2021లో కూడా బరిలోకి దిగారు. ప్రతినిధుల సభ, సెనెట్‌లలో కూడా సభ్యత్వం కోసం పార్టీలో ముందుకు వచ్చారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తాను జీవితాంతపు రిపబ్లికన్ అని, తాను పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థికోసం పోటీదార్లలో నిలిచేందుకు సగర్వంగానే దిగినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News