కేరకస్ (వెనిజులా ): సెంట్రల్ వెనిజులా లోని లానోస్ కేంద్ర కారాగారంలో శుక్రవారం జైలులో ఖైదీలకు భద్రతా దళాలకు మధ్య ఏర్పడిన ఘర్షణలో 40 మంది మృతి చెందగా, నేషనల్ గార్డు ఆఫీసర్తోసహా 50 మంది గ్రెనేడ్ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడ్డారు. వార్డెన్ కత్తిపోట్లకు గురయ్యాడు. జైలు లోని ఖైదీ తనకు ఆహారం తీసుకొచ్చిన బంధువులను జైలు అధికారులు లోపలికి పంపించక పోవడంతో ఆయుధాలతో తిరుగుబాటుకు దారి తీసింది. రాజధాని కేరకస్కు నైరుతి దిశగా 450 కిమీ దూరంలో ఈ కారాగారం ఉంది. జైళ్ల సర్వీసుల శాఖ మంత్రి ఐరిస్ వరేలా ఈ సంఘటన జరిగిందని నిర్ధారించారు. ఖైదీల గుంపు జైలు బయట భద్రతా అధికారులపై దాడి చేశారని చెప్పారు.
ఒకప్పుడు చమురు నిల్వలతో సంపద గల వెనిజులా రాజకీయంగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వీధి పోరాటాలు సర్వసాధారణమయ్యాయి. ప్రజా సేవలు లోపించడంతో దాదాపు ఐదు మిలియన్ మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. వెనిజులా లో దాదాపు 30 కేంద్ర కారాగారాలు, 500 సాధారణ జైళ్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,10, 000 మంది ఖైదీలు ఉన్నారు. కారాగారాలు ఖైదీలతో కిక్కిరిసి దారుణంగా ఉంటాయని ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాల నియంత్రణతో ఉంటాయని మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.