హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అంటే ప్రతి పది లక్షల మందిలో ఏకంగా లక్షా 61 వేల 988 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు హెల్త్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బుధవారం 56,178 మందికి టెస్టులు చేయగా మరో 612 మందికి వైరస్ సోకింది.
వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 144 మంది ఉండగా ఆదిలాబాద్లో 12, భద్రాద్రి 23, జగిత్యాల 12, జనగాం 10, భూపాలపల్లి 9, గద్వాల 7, కామారెడ్డి 6, కరీంనగర్ 28,ఖమ్మం 18, ఆసిఫాబాద్ 6, మహబూబ్నగర్ 7, మహబూబాబాద్ 13, మంచిర్యాల 15, మెదక్ 11, మేడ్చల్ మల్కాజ్గిరి 60, ములుగు 12, నాగర్కర్నూల్ 9, నల్గొండ 21, నారాయణపేట్ 3, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 11, సిరిసిల్లా 11, రంగారెడ్డి 73, సంగారెడ్డి 15, సిద్ధిపేట్ 7, సూర్యాపేట్ 9, వికారాబాద్ 2, వనపర్తి 4, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ లో 29, యాదాద్రిలో మరో 9 మందికి వైరస్ సోకింది.
అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,516కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,67,427కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయితే మరో రెండు నెలల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్ ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరగకుంటే మేలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆయన అన్నారు.
రెండు లక్షల 67 వేల మంది కోలుకున్నారు…
రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 2,67,427 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు అధికారులు తెలిపారు. అంటే ప్రతి వందలో సుమారు 96 మంది కోలుకుంటుండగా, కేవలం నలుగురు మాత్రమే క్రిటికల్ కండీషన్తో బాధపడుతున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.