Monday, April 29, 2024

రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

721 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 721 పాజిటివ్‌లు, ముగ్గురు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్
2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు దాటాయి. మంగళవారం నమోదైన 721 కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,75,261 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే వీరిలో ఏకంగా 2,66,120 మంది ఆరోగ్యవంతులుగా మారగా, ప్రస్తుతం కేవలం 7661 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 2085 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగతా వారంతా హోం ఐసోలేషన్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే మిగతా రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉండగా కొత్తగా నమోదైన కేసుల్లో 123 మంది జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా, ఆదిలాబాద్‌లో 5, భద్రాద్రి 26, జగిత్యాల 17, జనగాం 9, భూపాలపల్లి 10, గద్వాల 0, కామారెడ్డి 11, కరీంనగర్ 37,ఖమ్మం 32, ఆసిఫాబాద్ 8, మహబూబ్‌నగర్ 17, మహబూబాబాద్ 16, మంచిర్యాల 27, మెదక్ 12, మేడ్చల్ మల్కాజ్‌గిరి 58, ములుగు 14, నాగర్‌కర్నూల్ 10, నల్గొండ 31, నారాయణపేట్ 0, నిర్మల్ 3, నిజామాబాద్ 18, పెద్దపల్లి 24, సిరిసిల్లా 9, రంగారెడ్డి 51, సంగారెడ్డి 32, సిద్ధిపేట్ 18, సూర్యాపేట్ 21, వికారాబాద్ 9, వనపర్తి 2, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ లో 47, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,75,261కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,66,120కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. అయితే మరో రెండు నెలల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్ ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో తిరగకుంటే మేలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాస్కు, భౌతిక దూరం వంటివి పాటించాలని ఆయన అన్నారు.

స్పల్పంగా పెరుగుతున్న కేసులు…

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రతి రోజు సగటున ఆరు వందల చొప్పున తేలగా, మంగళవారం పాజిటివ్‌ల సంఖ్య ఏకంగా ఏడు వందలు దాటిందని ఆరోగ్యశాఖ నివేదించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన వారిలో 20 మందికి వైరస్…

ఓ పెళ్లి వేడుక ఇరవై మందికి కరోనా రావడానికి కారణమైంది. హజీపూర్ మండలం ధర్మారంలో ఇటీవల జరిగిన పెళ్లిలో ఏకంగా 20 మందికి వైరస్ తేలింది. పెళ్లి కొడుకుకు తాజాగా కరోనా రావడంతో మిగతా వారంతా పరీక్షలు నిర్వహించుకోగా వైరస్ తేలినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News