Monday, April 29, 2024

ప్రజారోగ్యానికి ఎన్ని కోట్లయినా వెచ్చిస్తాం

- Advertisement -
- Advertisement -

All kinds of services in government hospitals

 

కోబాస్ మిషన్ ద్వారా ప్రతి రోజు 4వేల పరీక్షలు చేయొచ్చు 
ఆసుపత్రుల్లో ఆగిపోయిన వైద్యసేవలను తిరిగి ప్రారంభిస్తున్నాం
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వారియర్స్‌కు అభినందనలు
మీడియాతో మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజారోగ్యం కోసం ఎన్ని కోట్లైనా వెచ్చిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు మరింత నాణ్యంగా అందించాలని సిఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా టెస్టులను వేగంగా నిర్వహించే కోబాస్ 8800 మిషన్‌ను ఆయన నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా పరీక్షలు వేగంగా చేయడానికి దక్షిణ భారత దేశంలో మెదటి సారిగా ఈ కోబాస్ 8800 మిషన్ ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా ప్రతి రోజు నాలుగు వేల కరోనా పరీక్షలను ఆర్‌టిపిసిఆర్ విధానంలో చేయొచ్చన్నారు. అంతేగాక ఒకే సారి హెచ్‌ఐవి, టీబీ, కరోనా మూడింటికి సంబందించిన పరీక్షలు కూడా ఈ మిషన్ ద్వారా చేయగలమన్నారు.

హెల్త్ కెపాసిటీని తెలియజేసింది…

కరోనా వైరస్ ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు, హెల్త్ సిస్టమ్ కెపాసిటీని కూడా ప్రభుత్వాలకు తెలియజేసిందన్నారు. ఇప్పటికే ఆరోగ్య విషయంలో ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ కావున ఇక్కడ మూత్రపిండాలు, లివర్, గుండె మార్పిడి చేయడానికి చాలా పరీక్షలు అవసరం అవుతాయన్నారు. ఈక్రమంలో అన్ని పరీక్షలను వేగంగా చేసేందుకు సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో మాలిక్యూలర్ డయాగ్నస్టిక్స్ సెంటర్‌ను ప్రారంభించామన్నారు.

అదే విధంగా కరోనా వల్ల ఆగిపోయిన అన్ని వైద్య సేవలు నిమ్స్ లో మొదలు పెడుతున్నామని మంత్రి ప్రకటించారు. దీంతో పాటు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. 15 రోజుల్లో నిమ్స్ పూర్తి స్థాయిలో పని చేస్తుందని, అతి త్వరలోనే కొత్త ఓపి బ్లాక్ నిర్మాణం కూడా మొదలు పెడతామని మంత్రి అన్నారు.అనంతరం నిమ్స్ వివిధ విభాగాల్లో రోజుకు పదివేల పరీక్షలు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి లాబ్స్ ను మరింత బలోపేతం చేయడానికి అవసరం అయిన నిధులు అందిస్తామని తెలిపారు. స్టెమ్ సెల్ లాబ్ తో పాటు మరికొన్ని సదుపాయాల వచ్చే నెలలో ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ డా సత్యనారాయణ, డా గంగాధర్ డా శ్రీనివాస్ తో పాటు పలువురు డాక్టర్లు , సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో ఉండే కరోనా పేషెంట్లకూ అన్ని సేవలు అందుతున్నాయి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో కరోనా పేషంట్లకు పూర్తి స్థాయులో చికిత్స అందిస్తున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. జమ్మికుంట లాంటి ఆసుపత్రుల్లో కూడా కరోన చికిత్స అందించే స్థాయికి ఎదిగినామన్నారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి డబ్బులు వృథా చేసి అప్పుల పాలు కావద్దన్నారు. ఎన్ని వేల మందికి అయిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రేమను పంచి నయం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని మంత్రి మరోమారు తెలిపారు.

ఉద్యోగుల జీతాలు పెంచుతున్నాం…
ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న శానిటేషన్, నాల్గవ తరగతి ఉద్యోగుల జీతాలు పెంచుతామని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్న డాక్టర్లు నర్సులు పారమెడీకల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందికి మంత్రి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

పేషెంట్లను పలకరించిన మంత్రి ఈటల…
నిమ్స్ ఆసుపత్రిలో బోన్ మారో చేపించుకున్న పలువురు పేషంట్లను మంత్రి న్వయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం కి చెందిన 12 సంవత్సరాల కార్తీక్, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన 20 సంవత్సరాల జ్యోతి, ఖమ్మం జిల్లాకు చెందిన 25 సంవత్సరాలు ప్రశాంత్ లతో మంత్రి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అయితే నలభై లక్షల రూపాయల ఖరీదైన చికిత్స ను ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందించడంపై వారందరూ మంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News