యుపి ప్రమాదంలో వలస కూలీల మృతిపై ఆనంద్ మహింద్ర ఆవేదన
ముంబయి: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉత్తరప్రదేశ్లో శనివారం జరిగిన ఘోర దుర్ఘటనలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలవడంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాజంలోని మనమంతా సిగ్గుతో తలదించుకోవాలంటూ విచారం వ్యక్తం చేశారు. ‘మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వలస కూలీలను మనమే మాయం చేశాం. దీనికి సమాజంలోని మనం అందరమూ బాధ్యులమే. ముఖ్యంగా చిన్నా, పెద్దా వ్యాపారులందరూ సిగ్గుపడాలి’ అంటూ ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు. వలస కార్మికుల సమస్యలకు దీర్ఘ, స్వల్పకాలిక పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేయాలని మహింద్ర గ్రూపును కోరారు.
వారికి ఎలా సాయపడగమో అన్వేషించాలని కోరారు. తద్వారా వారిని ఆదుకోవడానికి తన సంసిద్ధతను తెలియజేశారు. కోవిడ్19 కట్టడి నేపథ్యంలో రెండు నెలల సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా దేశంలో ప్రధాన పట్టణ పారిశ్రామికవాడలనుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి స్వస్థలాలకు పయనమై వెళుతున్న విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుజామున రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.