Sunday, April 28, 2024

ట్రంప్‌పై అత్యంత తీవ్రమైన రికో ఉల్లంఘన అభియోగాలు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్‌పై ఈ అభియోగాలు నమోదు కావడం గమనార్హం. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యురీ జారీ చేసిన 41ఛార్జి డాక్యుమెంట్‌లో ట్రంప్ సహా 18 మందిపై వీటిని మోపారు.

వీరిలో ట్రంప్ మాజీ లాయర్ రూడీ గులియానీ , మాజీ శ్వేతసౌధం చీఫ్ మార్క్ మెడోస్, వైట్‌హౌస్ లాయర్ జాన్ ఈస్ట్‌మన్, మాజీ జస్టిస్ డిపార్ట్‌మెంట్ జెఫ్రీ క్లార్క్ తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఏడాది నాలుగోసారి ట్రంప్ క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొన్నట్లైంది. ఎన్నికల్లో జోక్యంపై వాస్తవానికి 2021 ఫిబ్రవరి లోనే ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ దర్యాప్తు ప్రారంభించారు. ట్రంప్‌నకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చాలనే ఉద్దేశం తోనే సహ కుట్రదారులు దీనిలో భాగస్వాములయ్యారని తేల్చారు. అభియోగ పత్రంలో వ్యవస్థీకృత నేరగాళ్లతో వీరిని పోల్చారు. తప్పుడు వాంగ్మూలాలు, పత్రాలు సృష్టించడం , ఫోర్జరీ, తప్పుడు సమాచారంతో పత్రాలు పూర్తి చేయడం , సాక్షులను ప్రభావితం చేయడం, దొంగతనం, చట్ట ఉల్లంఘన వంటి నేరాలను మోపారు.

ఈ మొత్తం ఆరోపణల్లో ‘ది రాకెటీర్ ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ (రికో)’ ఉల్లంఘన అభియోగాలు అత్యంత తీవ్రమైనవి. ట్రంప్ బృందంపై ఈ ఆరోపణలు కూడా నమోదయ్యాయి. క్రిమినల్ సిండికేట్లను రూపుమాపేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వేర్వేరు అంశాలను కలిపి కుట్రలను వెలికి తీసే వెసులుబాటు ప్రాసిక్యూటర్లకు లభిస్తుంది. మరోవైపు ట్రంప్ బృందం ఈ ఆరోపణలపై స్పందించింది. ప్రాసిక్యూటర్‌ను ఆవేశపూరిత పక్షపాతిగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు చేసిన వారే 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని పేర్కొంది. వారు ట్రంప్ ప్రచార ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని యత్నిస్తున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News