Monday, April 29, 2024

చంద్రబాబుకు మరో షాక్

- Advertisement -
- Advertisement -

ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో
ఎ25గా టిడిపి అధినేతను చేర్చిన సిఐడి

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఎ25గా సిఐడి పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఎసిబి కోర్టులో సిఐడి అధికారులు పిటి వారెంట్ వేశారు. చంద్రబాబు నిందితుడిగా పేర్కొన్న ఫైబర్‌నెట్ కుంభకోణం గురించి పరిశీలిస్తే నిబంధనలను ఉల్లంఘించడం, టెండర్ ప్రక్రియలో అవకతవకలు చేయడం. చంద్రబాబు హయంలో ఆయన ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి శాఖలను కూడా కలిగి ఉన్నప్పుడు ఈ స్కాం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎపి ఫైబర్‌నెట్ ప్రాజెక్టు తొలిదశ టెండర్లలో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. రూ.330 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్‌ను అనుకూలమైన కంపెనీకి కేటాయించడానికి టెండర్ ప్రక్రియను తారుమారు చేసినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

పేస్ పవర్ వంటి ఇతర బిడ్డర్ల నుండి వచ్చిన నిరసనలను నిశ్శబ్దం చేయడం ద్వారా టెండర్‌ను టెరా సాఫ్ట్‌వేర్‌కు అప్పగించారనేది ఆరోపణ. టెండర్ల కేటాయింపు నుంచి మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని సిఐడి ఆరోపించింది. నాసిరకం మెటీరియల్‌ని ఉపయో గించడం, షరతులను ఉల్లంఘించడం, ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నప్పుడు ఆర్‌ఎఫ్‌పిలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సామర్థ్యంలో దాదాపు 80 శాతం నిరుపయోగంగా మారిందని వెల్లడించింది.

ఇది ఎపి ఫైబర్ నెట్ జీవిత కాలానికి శాశ్వత నష్ట మని చెబుతున్నారు. ఎపి ఫైబర్‌గ్రిడ్ ఫేజ్-1 ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో జరిగిన ఫిరాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 114 కోట్ల నష్టం వాటిల్లింది. ఖరీదైన ఆపరేషన్, నిర్వహణ పనులు, 80 శాతం ఉపయోగించలేని ఆప్టిక్ ఫైబర్ కారణంగా రాబడిని కోల్పోవడం వలన మరింత నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టును ఐటి శాఖకు బదులుగా ఇంధన మౌలిక సదుపాయాల శాఖ ద్వారా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా సిఫార్సు చేశారని ఎపి సిఐడి ఆరోపించింది. ‘పాలక మండలి-గవర్నెన్స్ అథారిటీ సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను చంద్రబాబు నియమించారు.

చంద్రబాబే ఫైబర్ నెట్ ప్రాజెక్టు అంచనాలకు ఆమోదం చెప్పారు. వస్తువుల ప్రక్రియ కోసం మార్కెట్ సర్వే లేదా అనుసరించాల్సిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోలేదు. వివిధ టెండర్ల మూల్యాంకన కమిటీల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను చేర్చాలని చంద్ర బాబు ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. టెరాసాఫ్ట్‌వేర్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన బ్లాక్ లిస్టింగ్‌ను చంద్రబాబు ఉపసంహరించుకున్నాడు. న్యాయమైన టెండర్ ప్రక్రియను కోరుతున్న అధికారులను చంద్రబాబు అనాలోచితంగా బదిలీ చేసి వారి స్థానంలో మరింత అనువైన అధికారులను నియమించార’ని ఎపి సిఐడి ఆరోపించింది. 2015 జూలై 31 నుంచి ఆగస్టు 7 వరకు దురుద్దేశపూర్వకంగానే బిడ్‌ను సమర్పించే చివరి తేదీని పొడిగించినట్లు సిఐడి ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది. టెరా సాఫ్ట్‌వేర్‌కు కన్సార్టియం ఏర్పాటు చేసి, బిడ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఇది జరిగిందని, తొలి టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా జూలై 31 నాటికి కంపెనీకి అవసరమైన కన్సార్టియం కూడా లేదని సిఐడి ఆరోపించింది. ఈ కేసులో అప్పటి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, హైదరాబాద్‌లోని నెట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ ప్రసాద్, గతంలో ఎపిఎస్‌ఎఫ్‌ఎల్ ఎండిగా పనిచేసిన కోగంటి సాంబశివరావుతో పాటు, ఇతరులపై కూడా సిఐడి ఆరోపణలు చేసింది. ఫోర్జరీ, మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి ఐపిసి సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం ఐపిసి సెక్షన్ల కింద 2021లో ఎపి సిఐడి ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఎ25గా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News