స్మగ్లర్లను చూసి ‘మోహను’డయ్యాడు
ఎక్సైజ్ పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గంజాయి తరలిస్తూ ఉప్పల్ పరిధిలో ఈ నెల 11న పట్టుబడిన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఎఆర్ కానిస్టేబుల్ మోహనకృష్ణను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించడంతో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. లాక్డౌన్ సమయంలో అనంతపురంలోని చెక్పోస్టులో విధులు నిర్వహించిన మోహన్కృష్ణకు గంజాయి పరిచయం ఏర్పడిందని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. చెక్పోస్టుల వద్ద డ్యూటీ చేసిన మోహనకృష్ణకు కారులో గంజాయి సప్లై చేసే ముఠా పట్టుబడింది. ఈ కేసులోని నిందితులను విచారిస్తున్న సమయంలో సదరు కానిస్టేబుల్కు గంజాయి వ్యాపారంతో ఎంత ఆదాయం వస్తుందో తెలిసింది.
అప్పటి నుంచి ఆ గ్యాంగ్తో చేతులు కలిపి మోహనకృష్ణ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. తొలుత అనంతపురం లోని హిందూపురం సిఐ శ్రీరామ్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్కు చెందిన కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈక్రమంలో మోహనకృష్ణ. ఆరు నెలల కిందటే కారు కొన్నప్పటికీ ఆ కారు తన పేరు మీద మార్చుకోలేదు. దాంతో సిఐ శ్రీరామ్ డ్రైవర్కు ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కేసులో సిఐ శ్రీరామ్ పేరు వినినించినప్పటికీ మోహనకృష్ణను పూర్తిస్థాయిలో విచారించడంతో గంజాయి దందాతో సీఐ శ్రీరామ్కు ఎలాంటి సంబంధాలు లేవని గుర్తించారు.
ఇదిలావుండగా ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన మోహనకృష్ణ కేసులో సోమయ్య, యాదగిరిల పాత్రను వెలికితీశారు. హైదరాబాద్లో మోహన్కృష్ణ సాగిస్తున్న గంజాయి సరఫరాకు సోమయ్య, యాదగిరిలు మధ్యవర్తులని గుర్తించారు. అలాగే వనస్థలిపురానికి చెందిన రాజు, ధూల్పేట, సీతాఫల్మండి, నానక్రామ్ గూడా, బాలానగర్ ప్రాంతాల్లో గంజాయిని అమ్ముతాడని మోహనకృష్ణ కాల్ డేటా ద్వారా పోలీసులు కనిపెట్టారు. వీరు నర్సీపట్నంలో కిలో గంజాయిని రెండువేలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో 8 వేలకు విక్రయిస్తున్నారని, హైదరాబాద్ శివార్లలోని కాలేజీ విద్యార్థులే వీళ్ల టార్గెట్ అని విచారణలో తేలింది. కొత్త సంవత్సర వేడుకల కోసమే ఈ గంజాయిని నగరానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్ విద్యార్థులే గంజాయిని తీసుకుంటున్నట్టు గుర్తించామని తెలిపారు. గంజాయి రాకెట్లో కీలక పాత్ర వహించిన కానిస్టేబుల్ మోహన్కృష్ట ముఠా హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర, బెంగుళూరు నగరాలకు కూడా ఈ ముఠా గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
మరో 66కిలోల గంజాయి స్వాధీనం…
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ అనంతపురం జిల్లా ఎఆర్ కానిస్టేబుల్ మోహనకృష్ణ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు బొంతు రాజును శనివారం నాడు పోలీసులు అరెస్టు చేసి 66కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న ఉప్పల్లోని నల్ల చెరువు వద్ద విశాఖపట్నం, నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన మోహన్కృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించారు.
అతడు ఇచ్చిన సమాచారం మేరకు పరారీలో ఉన్న బొంతు రాజు అనే నిందితున్ని శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 6 లక్షలు విలువ చేసే 66 కిలోల గంజాయి, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు.దీంతో నిందితుడు మోహన్ కృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద అంబరుపేటలో వుండే బొంత రాజు ను నాగోల్ లో అదుపులోకి తీసుకున్నామని అతని నానో కారులో 66కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.