Monday, April 29, 2024

బిసిల కులగణనను వెంటనే చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఒబిసి మహిళలకు కోటా కల్పించాలని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శిం చారు. కేంద్రంలో ఒబిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు. కెసిఆర్ స్పూర్తితో ఒబిసి హక్కుల సాధన ఉద్యమం సాగాలని ఆయన లాగ పట్టుదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని వెల్లడించారు.

మాజీ సిఎం కెసిఆర్‌ని ఆదర్శంగా తీసుకొని ఒబిసి హక్కుల కోసం మధ్యప్రదేశ్‌లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఒబిసి హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్‌సింగ్ యాదవ్ చేపట్టిన పీడిత్ అధికార్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌సి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దతియలో ఒబిసి ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎంఎల్‌సి కవితకు ఘనస్వాగతం పలికారు. యాత్రను ప్రారంభించిన అనంతరం ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన ఝాన్సీ రాణి, అవంతిబాయి వంటి పోరాటయోధులు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం అన్నారు. ఇదే రాష్ట్రానికి చెందిన ఒబిసి మహిళా ఉమా భారతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ప్రస్తావించారు.

తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కెసిఆర్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదిడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సిఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కెసిఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితి లేకుండా చేయడంతో పాటు రైతులకు పెట్టబడిసాయం, పండిన పంటను ప్రభుత్వమే కొను గోలు చేసే విధానాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. తెలంగాణను కెసిఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. కానీ ఝాన్సీ రైల్వేస్టేషన్‌ను చూస్తే మధ్యప్రదేశ్ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని, పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్యప్రదేశ్‌లో మారాలని ఆకాంక్షించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఒబిసి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒబిసిలు ఐక్యంగా లేరు కాబట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్నాయని, కాబట్టి ఒబిసిలకు ఐక్యం చేయడానికి దామోదర్ యాదవ్ ముందడుగు వేశారని ప్రశంసించారు. ఒబిసిలకు, మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒబిసి న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎవరి తప్పు అది ? దశాబ్దాలపాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఒబిసి న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎక్కువ చేయలేకపోయింది ? అని ప్రశ్నించారు.

ఒబిసిలకు ఎందుకు మద్ధతివ్వలేదు ? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఒబిసిల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యమిస్తే తప్ప కుండా అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఇది దామోదర్ సింగ్ యాదవ్ ఉద్యమం కాదని, ఇది ప్రజల కోసం, వెనుక బడిన వర్గాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమమన్నారు. దామోదర్ యాదవ్ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా అది విస్తరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యువకులు, మహిళలకు ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.

Kavitha 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News