న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో న్యాయాధికారుల నియామకానికి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్(ఎఐజెఎస్) తేవడంపై ఏకాభిప్రాయానికి రాష్ట్రాలతో మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. నవంబర్లో రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిరెన్రిజీజ్ జరిపే చర్చల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చనున్నట్టు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఖరారైన ఎజెండాలో న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల అంశం మాత్రమే ఉన్నది. ఎఐజెఎస్ ద్వారా దేశంలోని సబార్డినేట్ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకాలు జరపాలన్నది కేంద్రం యోచన. ప్రవేశ పరీక్ష ద్వారా యువ ప్రతిభావంతులకు న్యాయాధికారులుగా అవకాశాలు కల్పించే వీలుంటుందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం సబార్డినేట్ కోర్టుల న్యాయాధికారుల నియామకాలను హైకోర్టులు, రాష్ట్రాల సర్వీస్ బోర్డుల ద్వారా చేపడుతున్నారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎఐజెఎస్ ఏర్పాటుకు అనుమతిచ్చే అధికరణం 312ను రాజ్యాంగంలో చేర్చారు. అయితే, అందుకు చట్టం అవసరమవుతుంది. కింది కోర్టుల్లో స్థానిక భాషల్లో న్యాయ వివాదాలు పరిష్కరించాల్సి ఉన్నందున అఖిలభారత సర్వీసుల ద్వారా ఎంపికయ్యేవాళ్లు ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ఎలా విధులు నిర్వహించగలరన్న ప్రశ్నలు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి.
అఖిలభారత న్యాయ సర్వీస్పై మరోసారి చర్చించనున్న కేంద్రం
- Advertisement -
- Advertisement -
- Advertisement -