కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భూముల కొనుగోలుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ, కశ్మీర్లో ఎవరైనా భూములను కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నివాసం ఉండవచ్చని ప్రకటించింది. అయితే వ్యవసాయ భూములు ఇందుకు మినహాయింపు అని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నివాస యోగ్యతా పత్రాలు చూపించకుండానే భూములు కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇదంతా జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. అయితే వ్యవసాయ భూములను మాత్రం వ్యవసాయం చేసే వారు మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
అయితే విద్యాసంస్థలు, ఆస్పత్రులు లాంటి వాటిని ఏర్పాటు చేయడానికి వ్యవసాయ భూములను కొనుగోలు చేయడానికి ఈ చట్టంలో చాలా మినహాయింపులు ఉన్నాయి. జమ్మూ, కశ్మీరేతరులు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని, పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అత్యావశ్యకమని లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. కాగా ఈ సవరణలు జమ్మూకశ్మీర్ బయటి వ్యక్తులు ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి తలుపులు బార్లా తెరిచాయని రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఙషాక్ ఖాద్రి వ్యాఖ్యానించారు. ఈ సవరణలు ఎంతమాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని నేషనల్ కకాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దులాల ఒక ట్వీట్లో పేర్కొన్నారు. దీనివల్ల పేద, సన్నకారు రైతులు నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.