Saturday, April 27, 2024

బెంగాల్ హింసపై నిజనిర్ధారణ కమిటీ

- Advertisement -
- Advertisement -

Centre Appointed Committee on Bengal post poll Violence

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక సంఘటనలకు కారణాలను కనుగొనడంతో పాటు అక్కడి వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు నలుగురు సభ్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీని కేంద్ర హోంమంత్రిత్వశాఖ గురువారం నియమించింది. హోంశాఖలోని అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీ గురువారం పశ్చిమ బెంగాల్‌కు బయల్దేరి వెళ్లింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై సవివరంగా ఒక నివేదిక అందచేయాలని కేంద్ర హోంశాఖ బుధవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఘాటైన పదజాలంతో ఒక లేఖ రాసింది. హింసాకాండను వెంటనే ఆపడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కూడా కోరింది. అలా చేయనిపక్షంలో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కూడా హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో మంగళవారం నుంచి జరిగిన వేర్వేరు హింసాత్మక సంఘటనల్లో ఆరుగురు వ్యక్తులు మరణించారు. తమ పార్టీ కార్యకర్తలను టిఎంసి మద్దతుతో గూండాలు హత్య చేశారని, తమ పార్టీ మహిళా కార్యకర్తలపై దాడులు చేశారని, ఇళ్లను ధ్వంసం చేశారని, ఆఫీసులను, షాపులను లూటీ చేశారని బిజెపి ఆరోపించింది. తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలను హత్య చేశారని, దాదాపు లక్ష మంది ఇళ్లను వదిలి పారిపోయారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండడం ఈ సంఘటనలలో ఆమె ప్రమేయాన్ని సూచిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను మమత తోసిపుచ్చారు. బిజెపి అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలలోనే హింస, ఘర్షణలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు.

Centre Appointed Committee on Bengal post poll Violence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News