ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు నేపథ్యంలో
తాలిబన్ల ఆహ్వానంతో ఐఎస్ఐ చీఫ్ ఆకస్మిక పర్యటన
కాబూల్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ శనివారం ఆకస్మికంగా కాబూల్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చేవారం తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో హమీద్ నేతృత్వంలోని పాక్ బృందం అక్కడికి వెళ్లడం ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇరు దేశాల భవిష్యత్పై చర్చించడానికి తాలిబన్లు ఆహ్వానించగా హమీద్ బృందం అఫ్ఘానిస్థాన్కు వెళ్లిందని ఎఎన్ఐ రిపోర్టర్ హమ్జా అజ్హర్సలామ్ తెలిపారు. కాబూల్ విమానాశ్రయంలో దిగిన తర్వాత హమీద్ తన సహచరులతో టీ తాగుతున్న ఫోటోను సలామ్ ట్విట్టర్లో షేర్ చేశారు. తాలిబన్ నేతల కేంద్ర కార్యాలయం పాక్లోనే ఉన్నదని, ఐఎస్ఐతో వారికి లింక్లున్నాయని గతంలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, గతంలో అధికారికంగా తాలిబన్లతో లింక్ల గురించి పాకిస్థాన్ వెల్లడించకపోవడం గమనార్హం.
రహస్యంగా తాలిబన్లకు పాక్ ఆయుధాలను సరఫరా చేసినట్టు గత అఫ్ఘన్ ప్రభుత్వంతోపాటు అమెరికా విమర్శించింది. అఫ్ఘన్లో తాలిబన్లు పైచేయి సాధించడం వెనుక ఐఎస్ఐ తోడ్పాటు ఉన్నదన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. గత ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లను అధికారంలోకి తేవడంలో పాకిస్థాన్ తోడ్పాటు ఉన్నదని అమెరికాలో భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వి ష్రుంగ్లా శుక్రవారం వ్యాఖ్యానించారు. తాలిబన్లతోపాటు పలు శక్తుల్ని పాక్ పెంచి పోషిస్తున్నదని ష్రుంగ్లా విమర్శించారు. ఐక్యరాజ్యసమితి నివేదికలోనూ పొరుగున ఉన్న అఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో అల్ఖైదా, ఐఎస్ఐఎల్కెలాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయ నిపుణులు కూడా పాక్ తోడ్పాటుతోనే తాలిబన్లు అఫ్ఘన్లో తిరిగి అధికారం చేజిక్కించుకున్నారని చెబుతున్నారు.