Monday, April 29, 2024

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా!

- Advertisement -
- Advertisement -

China to blame for Sri Lankan crisis?

శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికార పక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు ఉపసంహరించుకొని స్వతంత్రులుగా ఉంటామని ప్రకటించారు. ఇది రాసిన సమయానికి తమ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందని, అధ్యక్షుడు, ప్రధాని గానీ రాజీనామా చేసేది లేదని మంత్రులు ప్రకటిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధత పట్ల జనం తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ అశాంతి ఎలా పరిష్కారం అవుతుందో ఊహించలేము. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు పూనుకుంది.

అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, మన దేశంలోని మీడియా చైనా వైపు వేలెత్తి చూపుతోంది. ఎంతవరకు వాస్తవం, అసలు నిజానిజాలేమిటి ?శ్రీలంకలోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ది చేశారు. రుణాన్ని లంక సర్కార్ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియా కట్టుకథ. దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా మన పత్రికలు, టివిలు వెంటనే అందుకుంటాయి. లంకలో చైనా నిర్మిస్తున్న విద్యుత్ పథకాలు మన దేశ భద్రతకు ముప్పు అని ముక్తాయింపు ఇస్తాయి. చైనా నిర్మిస్తున్నది కనుక ఇలా అంటున్నాయా లేక లంకలో నిర్మాణం జరుగుతున్నందుకా?అదే నిజమైతే తమిళనాడులో మనం నిర్మిస్తున్న పథకాలు కూడా తమ భద్రతకు ముప్పే అని లంక భావిస్తే తప్పుపడతామా? ఇదే తర్కాన్ని ఇతర మన ఇరుగుపొరుగు దేశాలు కూడా ముందుకు తెస్తే ఏంచెబుతారు?

శ్రీలంకకు రుణాలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్ధలు దేశా వరుసలో చైనా నాలుగవ స్ధానంలో ఉంది. హంబంటోటా రేవు నిర్మాణం తమ ప్రభుత్వ ఆలోచన తప్ప చైనాది కాదు అని 2020 అక్టోబరులో అధ్యక్షుడు రాజపక్స ప్రకటించాడు. చైనా నిర్మిస్తున్న పధకాలు అజాగళ స్ధనాల వంటివి అలంకార ప్రాయం తప్ప వాటి నుంచి పెద్దగా ఆదాయం రాదని ఒక పాటపాడతారు. తొలుత దీన్ని బ్రిటీష్ గూఢచార సంస్ధ, బిబిసి ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి పధకాల నిర్మాణాన్ని చైనా, మరొక దేశం ఏదైనా ఒక స్వతంత్ర దేశం మీద రుద్దగలవా ? చైనా నిర్మిస్తున్న పధకాలలో కొలంబో పోర్టు సిటీ ఒకటి. ఈ ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంలో పెట్టే సంస్ధలకు నాలుగు దశాబ్దాల పాటు పన్ను రాయితీలుంటాయి.

దీని గురించి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పిడబ్ల్యుసి) చెప్పిందేమిటి? రానున్న ఇరవై సంవత్సరాల్లో 12.7 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయి, లంక ఆర్ధిక వ్యవస్ధకు 13.8 బి.డాలర్లు తోడవుతాయని ఏడాది క్రితం పేర్కొన్నది. ఇది లండన్ కేంద్రంగా పని చేసే బహుళజాతి సంస్ధ. అదేమీ చైనా సంస్ధ కాదు కదా! ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5 బి.డాలర్లు. గడువులోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20 బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35 బి.డాలర్ల (ఇది 51 బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47 శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్ డెవలప్‌మెంట్ బాంకు నుంచి 14.3 శాతం, జపాన్ నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8 శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది. శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా ! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5 బి.డాలర్లుంది. వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా లంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు?

చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుంది అన్నది అసక్తికరం. హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్ పత్రిక పేర్కొన్నది. 2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి. 2009లో లంకలో అంతర్యుద్ధం ముగిసింది, ఆర్ధిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది.పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7 కోట్ల డాలర్ల రుణాలను 6.3 శాతం వడ్డీతో చైనా ఇచ్చింది.

తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018 లో చైనా అభివృద్ధి బ్యాంకు నుంచి వందకోట్ల డాలర్లను ఎనిమిదేండ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్ ఇంటర్ బాంక్ రేటు (లిబోర్) ప్రకారం 2.56 శాతానికి తీసుకుంది. తరువాత 2020 మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బాంకును మరో 50 కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దాని వైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్ పేర్కొన్నది. హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015 నాటికి రుణ కిస్తీ చెల్లించలేకపోవటంతో 70 శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది.

తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15 వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది. దీంతో ఆ రేవును హిందూ మహా సముద్రంలో చైనా మిలిటరీ అవసరాల కోసం వినియోగించనుందనే ప్రచారాన్ని అమెరికా, మన దేశం ప్రారంభించాయి. అదే నిజమనుకుంటే ఆ రేవు నిర్మాణానికి మన దేశం, అమెరికా తొలుత ఎందుకు తిరస్కరించినట్లు? చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు కెనడా.

దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సిలావలిన్ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యి పేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది.

అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు. మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 200515 మధ్య దానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్ కంపెనీ రావ్‌ుబోల్ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది. దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రావ్‌ుబోల్ నివేదికను తీసుకొని లంక సర్కార్ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ రంగంలోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబిలోకి దింపింది చైనా అని ఏ నోటితో చెబుతారు.ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది.

సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండు శాతం వడ్డీతో చైనా ఎగ్జివ్‌ు బాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనిక దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచంలో వడ్డీరేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్ గ్రూప్ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు. 2015 మధ్యంతర ఎన్నికల్లో అధికార పక్షంలో తిరుగుబాటు చేసిన ఆర్ధిక మంత్రి మైత్రీపాల సిరిసేన అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు. ఆ ఎన్నికల ప్రచారంలో రేవు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారని ప్రచారం చేశాడు. సిరిసేన పదవి స్వీకరణ తరువాత విదేశీ అప్పుల చెల్లింపుల సమస్య ముందుకు వచ్చింది. మొత్తం విదేశీ అప్పులో 40 శాతం బాండ్ల రూపంలో ఉంది. అప్పటికి విదేశీ అప్పులో జపాన్, ప్రపంచబాంకు, ఎడిబి ఇచ్చినవే ఎక్కువ. 2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చినమొత్తం కేవలం ఐదు శాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు.

అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్ వినియోగించింది. అజాగళ స్థ్దనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్ధపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా? సర్కార్ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది, దానిలో బలవంతం ఎక్కడ ? చైనా మిలిటరీ దాడి చేసి రేవును ఆక్రమించలేదు కదా! అప్పటి వరకు ఆ రేవు వ్యూహాత్మక ప్రాధాన్య గురించి ఎక్కడా ప్రస్తావించని అమెరికా ఒక్కసారిగా ఇంకేముంది చైనా మిలిటరీ కోసమే తీసుకున్నారంటూ మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు దొంగేడుపులు ప్రారంభించింది. 201218 మధ్య చైనా ఎగ్జివ్‌ు బాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ 2% వడ్డీ రేటువే.

2014లో చైనా డెవలప్‌మెంట్ బాంకు నుంచి తీసుకున్న 40 కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదు శాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదు శాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది. మెడెవాచచియా నుంచి మన్నార్ రైల్వే లైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ దేశంలో ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత తప్ప రుణమిచ్చిన వారు, నిర్మించిన సంస్థలది బాధ్యత ఎలా అవుతుంది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News