హైదరాబాద్ : వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కెసిఆర్ వెంటనే కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ గా పరిచయడం చేసుకున్న అతడు, గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడనని, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని సిఎం కెసిఆర్కు చెప్పుకున్నారు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్పై నుంచి పడడంతో తన కాలు విరిగిందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు తనకు తోడుగా ఉంటాడని భావించినప్పటికీ, అతని ఆరోగ్యం కూడా క్షీణించిందని వెల్లడించారు. కనీసం తాము ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని సిఎం కెసిఆర్ను ఆయన కోరాడు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలి చౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు.
సలీమ్ వికలాంగుడని ధృవీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్ కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.
CM KCR Generosity for An Old Man