Sunday, April 28, 2024

దిగ్విజయంగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ప్రారంభం
ఇప్పటివరకు 86 సభలు పూర్తి
ప్రతి సభలో ప్రగతి మాట..పల్లెలన్నీ కెసిఆర్ బాట
చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్న సభలు
ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న ప్రగతి శంఖారావం
కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి- ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు శుక్రవారంతో 86 పూర్తయ్యాయి. గత నెల 15వ తేదీన హుస్నాబాద్ సభతో ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద సభలు అప్రతిహతంగా కొనసాగుతూ జన ప్రవాహంతో బిఆర్‌ఎస్ విజయోత్సవాల సభలను తలపిస్తున్నాయి. ప్రధానంగా సిఎం కెసిఆర్ ప్రజాస్వామిక తాత్వికత విశ్లేషిస్తూ పార్లమెంటరీ పంథాను ప్రజలకు అర్థం చేయిస్తున్నారు. తమ ఆకాంక్షల సాధన కోసం రాజ్యాంగం అందించిన ఓటునే వజ్రాయుధంగా ఎట్లా వినియోగించుకోవచ్చునో ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో అప్రజాస్వామికంగా అసంబద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల్లో విద్వేషాలు నింపుతున్న ప్రతిపక్షాలపై ఈ సభల్లో రోజురోజుకూ వాడీవేడీ పెంచుతున్నారు. బిఆర్‌ఎస్ అంటే భరోసా అని.. కాంగ్రెస్ అంటే తెలంగాణకు శాపమని వివరిస్తున్నారు. తాను చెప్పిన అంశాలన్నీ ఇంటికి వెళ్లి ఆలోచించుకుని చర్చలు పెట్టమనడం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సభలకు వచ్చిన ప్రజలు కేరింతలు కొడుతూ బిఆర్‌ఎస్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుతున్నారు.
సిఎం కెసిఆర్ సభలతో అభ్యర్థుల్లో జోష్
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియోజకవర్గాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలతో అభ్యర్థులు, పార్టీ కేడర్‌లో జోష్ వస్తోంది. ఆయా నియోజకవర్గాలలో అధినేత సభల తర్వాత పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో అని సిఎం కెసిఆర్ వివరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేసిన ద్రోహాలను కెసిఆర్ తనదైన శైలిలో విమర్శిస్తున్నారు.

సిఎం కెసిఆర్ విపక్ష పార్టీలపై వేస్తున్న సెటైర్లు, చేస్తున్న విమర్శలతో సభలలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి పార్టీలు చేసిన మోసాలను ద్రోహాలను సిఎం కెసిఆర్ తనదైన శైలిలో ప్రశ్నిస్తున్న తీరు ఆందరినీ ఆకర్షిస్తోంది. ఆయా నియోజకవర్గాలలోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిఎం ప్రసంగిస్తున్నారు. ఉద్యమ ప్రస్థానాన్ని ప్రతీ నియోజకవర్గంలో ప్రస్తావిస్తూ.. రాష్ట్రావిర్భావంలో తన నాయకత్వాన్ని గుర్తు చేస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో రైతుబంధు, ఆసరా ఫించన్ల వంటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు వాటి ఫలాలను చెబుతూ.. భూముల విలువ ఎలా పెరిగిందోనని విశదీకరిస్తున్నారు.

ఒకవైపు చేసింది చెబుతూనే.. మరోవైపు మేనిఫెస్టోను వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీలపై ప్రతీ సభలోనూ విరుచుకుపడుతున్నారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు, విధానాలను విమర్శిస్తున్న గులాబీ దళపతి.. అప్పుడప్పడు ముఖ్యనేతలపైనా ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. కీలక నేతలు లేని ఇతర నియోజకవర్గాల్లో మాత్రం పార్టీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు
బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసిన ఆయా నియోజకవర్గాల ప్రజలు ఏది దొరికితే ఆ వాహనాలను పట్టుకుని సభలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగాలు వినడానికి చెట్ల చిటారు కొమ్మలు, బిల్డింగ్‌లు ఎక్కి వింటున్నారు. ఆటపాటలతో, కళాకారులు నింపుతున్న ఉత్సాహంతో సభ ప్రాంగణాలు కదం కలుపుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో ఎట్లయితే ప్రతి పల్లె కదిలి వచ్చిందో అంతకు మించిన చైతన్యంతో సిఎం కెసిఆర్ ప్రసంగాలు వినడానికి ఊర్లకు ఊర్లే తరలివస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజాఆశీర్వాద సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. సిఎం కెసిఆర్‌మాట తప్పడు, మడమ తిప్పడు అనే అచంచల విశ్వాసమే ప్రజలు పెద్దఎత్తున సభలకు వచ్చేలా చేస్తుంది. ఇచ్చిన మాట కోసం సిఎం కెసిఆర్‌ప్రాణం పోయినా వెనుకాడరనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఈ నమ్మకం, విశ్వాసం ఒక్క రోజుతో కెసిఆర్ మీద ఏర్పడినది కాదు. తాను ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిప్పటి నుంచే తెలంగాణ ప్రజలు కెసిఆర్‌పై విశ్వాసంతో వెంటనడిచింది, ఇప్పటివరకు నడుస్తోంది.
కెసిఆర్ ప్రసంగాలకు అవునంటూ గళం కలుపుతున్న ప్రజలు
రైతులకు రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలు, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకి పంటలకు సంబంధించిన డబ్బులు జమ చేయడం వంటి అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలకు అవునంటూ ప్రజలు గళం కలుపుతున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి అభివృద్ది జరగలేదని తేల్చిచెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తాను…చెప్పే మాటలను విని వుట్టిగనే పోవద్దని, చెప్పిన మాటలను గ్రామాల్లో చర్చకు పెట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కెసిఆర్ పిలుపుకు ప్రజలు ఆలోచనచేస్తున్నారు. తెలంగాణ అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే..అని పోల్చిచూస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వాలు కెసిఆర్ మాదిరిగా అభివృద్ది విషయంలో కనీసం ఆలోచన కూడా చేయలేదని తెలంగాణ రైతాంగం, యావత్ సమాజం పేర్కొంటుంది. తెలంగాణ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే బిఆర్‌ఎస్ కారు గుర్తుకే ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలంటోంది. గతంలో ఏ పాకులైనా ఇప్పటివరకు బిఆర్‌ఎస్ పాలనలో ఇచ్చినట్లు వేలల్లో పెన్షన్ ఇచ్చారా…? అంటూ కెసిఆర్ ప్రజలను అడుగుతుండగా..నిజమే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే పెన్షన్లు వేలల్లో ఇస్తున్నారని, బతికేందుకు సరిపడే మొత్తం అందుతున్నదని గ్రామాల్లో పెన్షనుదారులు, వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. కెసిఆర్ కాకుండా మిగతావారు గెలిస్తే పెన్షన్లు వస్తాయో..రావో అనే భయం పెన్షన్లు పొందుతున్న వారిలో వ్యక్తమవుతున్నది.
ప్రతిపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సిఎం
గతంలో ఎట్లుండె తెలంగాణ .,.ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు తెలంగాణలో సరైన పంటలు లేవు.. కరెంటు లేదు.. రైతుబంధు లేదు అని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మారిందని కెసిఆర్‌తో ప్రజలు ఏకీభవిస్తున్నారు. ఎక్కడ చూసినా పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని, ధాన్యపు రాశులు సిరులు కురిపిస్తున్నాయని అందరి నోట అదే మాటట వినిపిస్తోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటికి, త్రాగునీటికి కొరత లేకుండా పోయిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్లపై సిఎం ప్రజాఆశీర్వాద సభలో గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉండేవి. ట్యాంకర్లతో తరలించడం లేకుంటే కిలోమీటర్లు నడిచి బిందెపై బిందె ఎత్తుకుని మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు పోయేవాళ్లు. అప్పుడు తెలంగాణ అట్ల ఉండే..? ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి పైసా ఖర్చు లేకుండా నల్లా నీళ్లు వస్తున్నాయి. అప్పటి లెక్క ఇప్పుడు మంచినీళ్ల గోస ఉందా అని సభల్లో కెసిఆర్ ప్రజలను ప్రశ్నిస్తుంటే ముక్తకంఠంతో అంతా నీళ్ల సమస్య లేదంటూ చేతులెత్తి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ప్రతిపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను లక్షలాదిమంది సాక్షిగా ఎండగడుతున్నారు. 24 గంటల కరెంటు కావాలా…? కాంగ్రెస్ వాళ్లు అంటున్నట్లు 3 గంటల విద్యుత్ కావాలా? అంటూ కెసిఆర్ అడుగుతుంటే ప్రజలందరూ 24 గంటలు కరెంటు కావాలంటూ చేతులెత్తి జై కొడుతున్నారు.
ముక్తకంఠంతో సభ మారుమోగేలా నినాదాలు
ధరణి విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని …ధరణి ఉండాలా…వద్దా..? అని ప్రజలను ప్రజా ఆశీర్వాద వేదికలపై నుంచి అడుగుతుంటే ఉండాలంటూ ముక్తకంఠంతో ప్రజలందరూ చెబుతున్నారు. ధరణి ఉండాలనుకునేవారు చేతులెత్తంటి అంటే సభలో ఉన్నవారందరూ చేతులెత్తి సంఘీభావం తెలిపారు. రైతుబంధు పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను, రైతుబంధు పేరిట దుబారా చేస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారని.. మరి రైతుబంధు ఉండాలా..? వద్దా..? అనే అంశంపై ప్రజలను సభా వేదిక నుంచి సిఎం కెసిఆర్ ప్రశ్నిస్తే, రైతుబంధు ఉండాల్సిందేనంటూ ప్రజలు ముక్తకంఠంతో సభ మారుమోగేలా నినాదాలు చేశారు. దళితబంధు విషయం ప్రస్తావిస్తూ.. దళితబంధులాంటి పథకం పెట్టాలని, ఉచితంగా పది లక్షల సాయం చేయాలని, దళితుల జీవితాలు మార్చాలనే ఆలోచన గతంలో ఎవరైనా చేశారా..?అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. దళితులను వెలివాడలకు పరిమితం చేసింది కాంగ్రెస్ అంటూ సిఎం కెసిఆర్ విపక్షాలను విమర్శిస్తుంటే.. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమేననే చర్చ దళిత సమాజంలో జరుగుతున్నది.అంతేకాకుండా గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదన్న కెసిఆర్ విమర్శతో దళిత వర్గాలు ఏకీభవిస్తున్నాయి. అదేవిధంగా మైనారిటీలను కూడా గత పాలకులు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ప్రజాఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రసంగంపై ముస్లీం మైనారిటీ వర్గాలు నిజమేనంటున్నాయి.కెసిఆర్ ప్రభుత్వంలోనే తమకు సంక్షేమ పథకాలు, సరైన న్యాయం జరుగుతున్నదని ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆలోచింపచేస్తున్న సిఎం ప్రసంగాలు
ప్రజాఆశీర్వాద సభలలో సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రసంగాలు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాలను ఆలోచింపచేస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎట్లుండే..ఇప్పుడు తెలంగాణ ఎట్లుందని బేరీజు వేసుకుంటూ..అభివృద్ది, సుస్థిర పాలన అందించే సిఎం కెసిఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News