Monday, April 29, 2024

పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం

- Advertisement -
- Advertisement -
CM KCR Review Meeting on Podu Lands
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులకు మేలు జరగాలి : ప్రగతిభవన్ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
పోడు సమస్య పరిష్కారానికి కార్యక్రమం
నవంబర్ 8 నుంచి డిసెంబర్
8 వరకు పోడు భూములపై
దరఖాస్తుల స్వీకరణ నవంబర్
8లోగా సన్నాహక సమావేశాలు
ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం కింద
గ్రామ నియామకం ,
రెండు, మూడు గ్రామాలకొక
నోడల్ అధికారి
ఆ 12 జిల్లాల్లోనే
87% అటవీ భూముల
ఆక్రమణ భద్రాద్రి కొత్తగూడెం,
కొమురంభీం ఆసిఫాబాద్,
మహబూబాబాద్, ములుగు,
ఆదిలాబాద్, జయశంకర్
భూపాలపల్లి, కామారెడ్డి,
ఖమ్మం నిర్మల్, వరంగల్,
నల్లగొండ, నిజామాబాద్
జిల్లాల్లోనే : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు సాగు చేసుకుంటున్న గిరిజనుల నుండి దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. 8వ తేదీలోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో ఆర్‌డిఒ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. 87 శాతం పోడు భూముల ఆక్రమణ భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి 12 జిల్లాల్లోనే ఉందని సిఎం అన్నారు.

పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ – పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే అలాంటి వారిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలన్నారు. అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయాలన్నారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆశించిన విధంగా పని చేస్తున్న జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సిఎం స్పష్టం చేశారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు , సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , పిసిసిఎఫ్ శోభ , పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.

అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలి

పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలను నిర్వహించాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్‌ఒఎఫ్‌ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని సిఎం సూచించారు. ఇందులో శాసనసభ్యులు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు తదితర ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అడవుల రక్షణను ఒక బాధ్యతగా తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యంగా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు

అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుండి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల అడవి బిడ్డలు అడవికి నష్టం చేయరన్నారు. బయటి నుండి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని సిఎం ఆదేశించారు. అవసరమైతే పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అడవులను కాపాడుకునే అమాయకులు ఎవరు? అడవులను నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరు అనేది గుర్తించడం ముఖ్యమన్నారు. ఫారెస్టు లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫారెస్టు భూములకు శాశ్వత బౌండరీలను ఫిక్స్ చేసి సరిహద్దులకు ప్రొటెక్షన్ ట్రెంచ్ ఏర్పాటు చేసి, ట్రెంచ్ పైన గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. ట్రెంచ్ ఏర్పాటు చేయడానికి అటవీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు.

సోషల్ ఫారెస్ట్ లో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని సిఎం అన్నారు. ఒక పది ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ లో అడవుల పునరుజ్జీవం చేపట్టినట్లుగానే అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతో పాటు, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే సదరు పట్టా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News