Saturday, April 27, 2024

రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె

- Advertisement -
- Advertisement -

 Medaram Jatara

 

సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్

అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం
అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
కెసిఆర్‌తో పాటే దేవతలను సందర్శించుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు చీర, సారె సమర్పించారు. వనదేవతల దర్శనానికై శుక్రవారం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో సిఎం కెసిఆర్ మేడారానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేడారానికి విచ్చేసిన సిఎంకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షే మ శాఖా మంత్రి సత్యవతిరాథోడ్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంఎల్‌ఎలు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రత్యేక వాహనశ్రేణిలో వివిఐపి దర్శన ద్వారం ద్వారా అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్న సిఎంకు ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, గిరిజన పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

తలపై సారె మోస్తూ సిఎం కెసిఆర్ ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ గద్దెల వద్దకు చేరుకున్నారు. మొదట సమ్మక్క గద్దె వద్దకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. సమ్మక్క తల్లికి సారె, పట్టువస్త్రాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం సారలమ్మ గద్దె వద్దకు వెళ్లి చీర, సారెలు సమర్పించి పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం తరపున సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు చీరె, సారెలను సమర్పించిన అనంతరం గోవిందరాజుల గద్దె వద్దకు ఆ తరువాత పగిడిద్దరాజుల గద్దెల వద్దకు వెళ్లి సిఎం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతిబిడ్డపై ఉండాలని ముఖ్యమంత్రి అమ్మవార్లను కోరుకున్నారు.

అనంతరం సిఎం కెసిఆర్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి సిఎం కెసిఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హుండీలో అమ్మవార్లకు కానుకలు సమర్పించారు. దర్శన అనంతరం ములుగు ఎంఎల్‌ఎ సీతక్క సిఎం కెసిఆర్‌కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వనదేవతల చిత్రపటాన్ని అందించారు. సిఎం మేడారం పర్యటనలో మంత్రులతోపాటు ఉమ్మడి జిల్లా ఎంఎల్‌ఎలు రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఉన్నారు.

భారీ బందోబస్తు
వనదేవతల దర్శనానికి సిఎం కెసిఆర్ రావడంతో పోలీసులు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు ఎస్పి సంగ్రామ్‌సింగ్ ఆధ్వర్యంలో మేడారంలో బందోబస్తును పర్యవేక్షించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం పర్యటనకు ముఖ్యమంత్రి కెసిఆర్ విచ్చేయనున్నట్లు ఖరారైన వెంటనే మూడురోజుల కింద హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బంది మేడారానికి విచ్చేసి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడారంలో అడుగడుగునా పోలీసులు నిఘా ఉంచారు. సిఎం పర్యటన ప్రశాంతంగా ముగిసేందుకు తగిన చర్యలు చేపట్టారు.

CM KCR visited Medaram Jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News