కరీంనగర్ టూ-టౌన్ పోలీస్స్టేషన్లో ఘటన, విచారణకు డిజిపి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం చోరీ జరిగిన వైనంపై రాష్ట్ర డిజిపి సీరియస్ అయ్యారు. మద్యం మాయం కావడంపై పూర్తిస్తాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని టూటౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టగా మాయం అయింది. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో పోలీసుశాఖకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లోనే చోరీ అంటే పరువు పోతుందని పోలీసులు నోరు విప్పడం లేదు. ఓ పోలీస్ స్టేషన్లో మద్యం చోరీ జరగడం కలకలం రేపుతోంది. మాములుగా ఇళ్లలో షాపుల్లో దొంగతనాలు జరుగుతుంటాయి . కానీ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేటుగాళ్లు మద్యం చోరీ జరగటంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు మద్యాన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.