బీజింగ్లోని పలు ప్రాంతాల మూసివేత..!!
బీజింగ్ : చైనాలో మరోసారి చేపల మార్కెట్లో కరోనా జాడలు కనిపించాయి. బీజింగ్లోని చేపల మార్కెట్ అందుకు వేదికైంది. దాంతో, శనివారం ఆ దేశ రాజధాని బీజింగ్లో లాక్డౌన్ విధించారు. నగరంలోని 11 నివాస ప్రాంతాల్ని మూసేశారు. అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ జిన్పడీని లాక్డౌన్ చేశారు. ఇది కూరగాయలు, మాంసం, చేపల హోల్సేల్ మార్కెట్. ఈ ప్రాంతంలోని వ్యాపారులు, ఉద్యోగుల నుంచి 517శాంపిళ్లు తీసుకొని పరీక్షించగా 45మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సాల్మన్ చేపల్ని ముక్కలు చేసే మొద్దుపై వైరస్ను గుర్తించినట్టు మార్కెట్ చైర్మన్ తెలిపారు.
ఈ మార్కెట్ నుంచే నగరంలోని మిగతా మార్కెట్లకు కూడా చేపలు సరఫరా అవుతాయి. దాంతో, చేపల దుకాణాలన్నిటినీ మూసేశారు. 2కోట్ల 10 లక్షల జనాభా ఉన్న బీజింగ్లో 55 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు 48 గంటల్లో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. గురు, శుక్ర వారాల్లో ఫెంగ్తాయి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. అవి కూడా అక్కడి మార్కెట్ ప్రాంతంలోనే కాగా, అందులో ఒకటి మాంసం పరిశోధనా సంస్థలో కావడం గమనార్హం. దాంతో, ఆ మార్కెట్ను కూడా ఇప్పటికే మూసేశారు.