Monday, April 29, 2024

హైద్రాబాద్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాసుదేవ్ ఆచార్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సిపిఎం నేత బాసుదేవ్ ఆచార్య సోమవారం నాడు హైద్రాబాద్ లో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన బాసుదేవ్ ఆచార్య హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాసుదేవ్ ఆచార్య వయస్సు 82 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన హైద్రాబాద్ లో కొడుకుతో కలిసి ఉంటున్నాడు.

1942 జూలై 11న పురులియాలో బాసుదేవ్ ఆచార్య జన్మించారు. విద్యార్ధి దశ నుండే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమం, ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎండి సలీమ్ బాసుదేవ్ ఆచార్య మృతిపై సంతాపం తెలిపారు. ప్రముఖ పార్లమెంటేరియన్, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సలీమ్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం హైద్రాబాద్‌లో బాసుదేవ్ ఆచార్య మృతి చెందారని సలీం ప్రకటించారు. అనుభవం ఉన్న నేత, లెఫ్ట్ నాయకుడు బాసుదేవ్ ఆచార్య మృతిపై బెంగాల్ సిఎం మమత బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. బాసుదేవ్ ఆచార్య మృతి పేదలకు తీవ్ర నష్టాన్ని కల్గిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. బాసుదేవ్ ఆచార్య కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు సానుభూతిని తెలిపారు మమత బెనర్జీ. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా బాసుదేవ్ ఆచార్య ఉన్నారు. బంకురా పార్ల మెంట్ స్థానం నుండి బాసుదేవ్ ఆచార్య 1980 నుండి 2014 వరకు తొమ్మిది దఫాలు విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి మున్ మున్ సేన్ చేతిలో బాసుదేవ్ ఆచార్య ఓటమి పాలయ్యారు. తన చిన్నతనంలో బాసుదేవ్ ఆచార్య అనేక కార్మిక ఉద్యమా ల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, ఎల్‌ఐసీ ఏజంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, డీవీసీ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్లనకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. సిఐటియు జనరల్ కౌన్సిల్, వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడ బాసుదేవ్ ఆచార్య కొనసాగుతున్నారు. అనేక పార్లమెంటరీ కమిటీల్లో బాసుదేవ్ ఆచార్య పనిచేశారు. 25 ఏళ్ల పాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో బాసుదేవ్ ఆచార్య సభ్యుడిగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News