Sunday, April 28, 2024

కాంగ్రెస్‌లో సంక్షోభం కొత్త కాదు..

- Advertisement -
- Advertisement -

Crisis is not new in Congress party

జాతీయ కాంగ్రెస్ పార్టీలో తాజా కలకలం ఇప్పుడు కొత్తేమీకాదు. 135 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ సంక్షోభాలు వంటివి ఎన్నో ఉన్నాయి. నెహ్రూ నుంచి పివి నర్సింహారావు వరకు ఎంతో మందికి అసంతృప్తి జ్వాలలు ఎదురయ్యాయి, సమసిపోయాయి. కానీ అన్ని సంక్షోభాలు వేరు.. ఇప్పటి సంక్షోభం వేరు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలోని భారతీయ జనతా పార్టీ అన్ని హంగులతో బలీయమైన స్థాయిలో ఉంది. మోడీ, -షాల వ్యూహాలకు ఎవరూ ఎదురొడ్డి నిలబడలేని పరిస్థితి ఉంది. బిజెపికి పోటీ ఇవ్వలేక ప్రతీసారీ చతికిలపడుతున్న కాంగ్రెస్ పార్టీకి తాజా సంక్షోభం నిరాశ కలిగించే విధంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ..కేంద్రంలో నాలుగు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు కొత్త కాదు. పరిస్థితి విషమించి పార్టీ నిట్టనిలువునా చీలిపోయిన సందర్భాలూ ఉన్నా యి. సోనియా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు 1999 లోక్‌సభ ఎన్నికలకు ముందు శరద్ పవార్, పిఎ సంగ్మా, తారిఖ్ అన్వర్ తిరుగుబాటు చేశారు. వారిని పార్టీ నుంచి తొలగించారు. 2001లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సోనియాపై పోటీకి దిగారు అప్పటి సీనియర్ నేత జితేంద్ర ప్రసాద్. ఈ సమయంలో పార్టీ సోనియాను ఆదరించింది.

1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీతారామ్ కేసరిపై కొందరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పివి నర్సింహారావుకు వ్యతిరేకంగా 1990లో మరోసారి పార్టీలో అసమ్మతి బయటపడింది. గాంధీయేతర నాయకుడైన మాజీ ప్రధానమంత్రి పివి నర్సింహారావుపై కొంతమంది నాయకులు తిరుగుబాటు చేశారు. ఫలితంగా ఎన్‌డి తివారి, అర్జున్ సింగ్ కాంగ్రెస్ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. ఇలాంటి సంక్షోభమే రాజీవ్ గాంధీ కాలంలోనూ ఎదురైంది. 1987లో ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడూ అయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించిన విపి సింగ్ ప్రభుత్వంలోని అవినీతిపై గళం విప్పారు. ఆ పరిణామంతో విపి సింగ్‌ను తొలుత మంత్రి పదవి నుంచి, ఆ తర్వాత పార్టీ నుంచి తొలగించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన విపి సింగ్ కొంత మంది కాంగ్రెస్ అసంతృప్త నాయకులతో కలిసి జన్ మోర్చా పార్టీని ప్రారంభించారు.

1969లో రాష్ట్రపతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి అయిన వివి గిరికి ఇందిరా గాంధీ మద్దతు తెలిపారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా నిజలింగప్ప ఉన్నారు. ఇందిరా చర్యలతో పార్టీలోని సీనియర్ నేతలు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు. ఈ పరిణామాలతో అప్పటి కాంగ్రెస్ పీఠంపై ఉన్న ఎస్ నిజలింగప్ప ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత పార్టీ రెండు గా చీలిపోయింది. ఆ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. దేశంలో ఎమెర్జెన్సీ విధించిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో మరోసారి పార్టీలో సంక్షోభం తలెత్తింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన కె.బ్రహ్మానందరెడ్డి, మరో నేత వైబి చవాన్ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

1977 ఎన్నికల ముందు పార్టీలో చీలికలు ఏర్పడిన తర్వాత జగ్జీవన్ రామ్.. హెచ్ ఎన్ బహుగుణతో కలిసి కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ పార్టీని స్థాపించారు. ఇలాంటి పరిణామాలే నెహ్రూ హయాంలోనూ ఉన్నాయి. పురుషోత్తమ్ దాస్ టాండన్, కెఎమ్ మున్షి, నర్‌హర్ విష్ణు గాడ్గిల్ వంటి నాయకులతో జవహర్‌లాల్ నెహ్రూ సమస్యలను ఎదుర్కొన్నారు.1950లో జరిగిన ఎఐసిసి సమావేశంలో పార్టీకి అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న తన నిర్ణయాన్ని టాండన్ ప్రకటించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అవి. 1951 జులైలో సీడబ్ల్యుసీకి నెహ్రూ రాజీనామా చేసినప్పుడు మళ్లీ సంక్షోభం తలెత్తింది. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత టాండన్ రాజీనామా చేశారు. అదే ఏడాది అక్టోబరులో ఢిల్లీ వేదికగా జరిగిన ఎఐసిసి సమావేశంలో నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నెహ్రూ కాలం నుంచి నుంచి పివి నర్సింహారావు హయాం వరకూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షోభాలను చూసింది. ఎంతో మంది కీలక నేతలు సొంతకుంపటి పెట్టుకుని వెళ్లిపోయా రు. అనేక రాష్ట్రాల్లో ‘కాంగ్రెస్’ పేరుతో ప్రాంతీ య పార్టీలు వెలిశాయి. ఆయా పార్టీలు సైతం వారి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. ఇన్ని జరిగినా జాతీయ కాంగ్రెస్ పార్టీ తట్టుకుని నిలబడింది. ఆ తరువాత దేశాన్ని పాలించింది. కానీ అన్ని సంక్షోభాలు వేరు. ఇప్పటి సంక్షోభం వేరు. అధికారంలో ఉన్న మోడీ, షాలు కలిసి సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించి ఇతర పక్షాలను చీల్చేస్తున్నారు. తమలో కలుపుకుంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లను కూడా తెచ్చుకోలేకపోతోంది. వరుసగా రెండోసారి కూడా అధికారానికి దూరమైంది. చిత్తుగా ఓడిపోతోంది. ఈ నేపథ్యంలో దేశానికి ఒక బలమైన ప్రతిపక్షం కూడా అవసరమే అని భావించేవారికి నిరాశే కలుగుతోంది. తాజా సంక్షోభం తాత్కాలికంగా సమసిపోయినట్టు ఆ పార్టీ ప్రకటించినా ఈ సమస్య నుంచి విజయవంతంగా కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ ఎలా గట్టెక్కిస్తారనేదే ఆసక్తికరంగా మారింది.

శ్రీనివాస్ – గౌడ్ ముద్దం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News