ముంబై: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సబబుగా లేదని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ విమర్శించాడు. భారత క్రికెట్కు సంబంధించిన ప్రతి అంశంలోనూ గంగూలీ స్పందించడాన్ని అతను తప్పుపట్టాడు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకోలేదని గుర్తు చేస్తున్నాడు. ఐపిఎల్తో మొదలుకొని ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలపై గంగూలీ జోక్యం చేసుకోవడాన్ని వెంగసర్కార్ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి రోహిత్ శర్మ ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్కు బదులు గంగూలీ సమాధానం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నాడు. బోర్డు అధ్యక్షుడికి జట్టు ఎంపికతో సంబంధం ఏంటనీ వెంగసర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేగాక ఐపిఎల్ నిర్వహణ తదితర అంశాలపై కూడా గంగూలీ అన్ని తానై వ్యవహరించడం కూడా సబబు కాదన్నాడు. ఈ అంశంలో ఐపిఎల్ చైర్మన్కు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నాడు. గంగూలీ చేస్తున్న అతి తనతో పాటు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని వెంగ్సర్కార్ పేర్కొన్నాడు.