సిఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండండి
తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు, సేవా కార్యక్రమాలనే చేపట్టిండి
పార్టీ శ్రేణులను, అభిమానులను, అనుచరులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఎవరు హైదరాబాద్కు రావొద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, అనుచరవర్గాలకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఈ నేపథ్యంలో తాను శనివారం ఎవరిని కలవడం లేదని ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కెటిఆర్ కోరారు.
ఇప్పటికే తాను విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తలపెట్టిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు పంపిణీ చేయాల్సిన ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు కెటిఆర్ వస్తున్నాయని, వాటన్నింటిని క్రోడీకరించి ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా వాహనాలను అందిస్తామని తెలిపింది.