Monday, April 29, 2024

నెల రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది

- Advertisement -
- Advertisement -

నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పార దర్శకత, జవాబుదారీతనం సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. నెల రోజుల పాలనపై ఆదివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యామని, ప్రజలతో బలమైన అనుబంధాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు.

పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నారని ఆయన అన్నారు ముఖ్యంగా నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల్లో జవాబుదారీతనం, పారదర్శకతపై ప్రభుత్వ దృష్టిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సానుకూల మార్పును తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజా పాలన ఎలా ఉండాలో ఒక నెలలోనే తాము చేసి చూపించామన్నారు. తెలంగాణ ప్రజలు కొత్త స్వాతంత్య్ర భావాన్ని గ్రహిస్తున్నారని, నియంతృత్వ పాలన ముగియడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు. పౌరుల అంచనాలకు అనుగుణంగా పాలన అందించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఆయన వెల్లడిస్తూ..గత నెల రోజులుగా నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల పనితీరును అంచనా వేసేందుకు పలు సమీక్షా సమావేశాలు నిర్వహించామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

“ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నష్టం తదితర అంశాలపై సమీక్షించాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం” అని ఆయన అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖను కలిసి విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి తాను ఢిల్లీకి వెళ్లానన్నారు. రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని , గత బిఆర్‌ఎస్ పాలన లోపం వల్ల పౌర సరఫరాల శాఖ రూ.58 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని ఆయన తెలియజేశారు. ఇంకా, గత బిఆర్‌ఎస్ పాలన ద్వారా పేదలకు సరఫరా చేసిన బియ్యం కిలో రూ.39 వెచ్చిస్తున్నప్పటికీ 70 శాతానికి పైగా బియ్యం నేరుగా వినియోగించడం లేదని, కిలో రూ.5 కే ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని, ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల పౌర సరఫరాల శాఖలో పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన పాలన కొనసాగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News