మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఇడి
నటి రియా రూ.15కోట్లు వాడుకున్నట్లు సుశాంత్ తండ్రి ఫిర్యాదు
పాట్నా/న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. తన గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్ ఖర్చులను సుశాంత్ భరించాడని వెల్లడైంది. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్ భరించాడని బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. సుశాంత్ విషాదాంతంపై దర్యాప్తు చేపట్టిన బీహార్ పోలీసులు ముంబైకు చేరుకుని విచారణను వేగవంతం చేయడంతో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. కుంగుబాటుతో బాధపడుతున్న సుశాంత్కు 2019 నవంబర్ నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్ కేసరి చావ్దానూ బీహార్ పోలీసులు సంప్రదించారు.
కొద్దినెలలుగా సుశాంత్ మందులు సరిగ్గా వేసుకోవడం లేదని, ఆహారం సవ్యంగా తీసుకోవడం లేదని డాక్టర్ వెల్లడించారు. సుశాంత్ సరిగ్గా స్పందించకపోవడంతో తాను కూడా వైద్య సలహాలు ఇవ్వడం విరమించానని ఆయన పోలీసులకు తెలిపారు. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్రపై సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు గత మంగళవారం ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్ ఖాతా నుంచి రూ 15 కోట్లు వేరే ఖాతాలకు బదిలీ అయ్యాయని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) కేసు నమోదు చేసింది. శుక్రవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఆ విభాగం వెల్లడించింది. బీహార్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్న ఇడి సుశాంత్ ఖాతాల లావాదేవీలకు సంబంధించి విచారణను వేగవంతం చేసే అవకాశాలున్నాయి. తాజా పరిణామాల నేపధ్యంలో సుశాంత్ సోదరి ఆసక్తికర ట్వీట్ చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు.
ED files money laundering case in Sushant Suicide