Monday, April 29, 2024

ఎల్గార్ పరిషత్ కేసు.. బెయిల్‌పై వెర్నాస్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలు విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కార్యకర్తలు వెర్నాస్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీం కోర్టు వారం రోజుల క్రితం జులై 28న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల తరువాత వీరి విడుదలకు సంబంధించి స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ నవీముంబై లోని తలోజా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు బయట వీరి రాక కోసం నిరీక్షిస్తున్న మద్దతుదారులు, బంధువులు కొందరు వారికి స్వాగతం పలికారు.

ఈ కేసులో అరెస్టయిన 16 మందిలో బెయిలు పొందిన వారిలో వీరిద్దరితోపాటు మొత్తం ఐదుగురు అవుతారు. నిందితుల్లో ఒకరైన క్రైస్తవ మతబోధకుడు స్టాన్ స్వామి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటుండ గానే ప్రైవేట్ ఆస్పత్రిలో 2021 జులైలో చనిపోయారు. శనివారం ఉదయం ఈ కేసుకు సంబంధించిన న్యాయవాది ఈ ఎన్‌ఐఎ కేసులను స్పెషల్ కోర్టు విచారించి విడుదలకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. జస్టిస్‌లు అనిరుద్ధబోస్, సుధాంశు ధులియా లతో కూడిన సుప్రీం ధర్మాసనం జులై 28న వీరికి బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఎన్‌ఐఎ వీరి బెయిల్‌కు అదనంగా కొన్ని షరతులు విధించింది. వ్యక్తిగత పూచీకత్తుపై ఒక్కొక్కరు రూ. 50 వేలకు పూచీ ఇవ్వాలని కోరింది. కేసు గురించి మీడియాతో మాట్లాడరాదని , వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందితే తప్ప కోర్టు విచారణలకు హాజరు కావాలని షరతులు విధించింది. గోన్‌సాల్వెస్, ఫెరీరా ఈ కేసులో 2018లో అరెస్ట్ అయ్యారు. వీరి కన్నా ముందు మరో ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News