Sunday, April 28, 2024

రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….

- Advertisement -
- Advertisement -

రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి.
సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్

Farmer movement guarantees should be implemented

మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల ఉద్యమానికి ఇచ్చిన హామీలను ద్రోహం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రజా సంఘాల అధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు బి వెంకట్, టి సాగర్, జక్కుల వెంకటయ్య, సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి (C2+50%) చట్టబద్ధమైన హామీని అమలు చేయాలని కోరారు.

లఖింపూర్ ఖేరీ కేసులో జరుగుతున్న న్యాయ ప్రక్రియను సమీక్షించిన అనంతరం పోలీసు యంత్రాంగం, న్యాయవాదులు కలిసి నేరగాళ్లను రక్షించి అమాయక రైతులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి సీరియస్ కేసులో కేంద్రమంత్రి కుమారుడికి ఇంత త్వరగా బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగించే అంశమని పేర్కొన్నారు. మిశ్రా విడుదలైన తర్వాత కేసులో కీలక సాక్షిపై దాడి జరిగిందన్న వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకు భారత ప్రభుత్వం ఇచ్చిన వ్రాతపూర్వక హామీ మూడు నెలల తర్వాత కూడా చర్య తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఎంఎస్పీపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చినా నేటికి కూడా జాడ లేదని అన్నారు.

హర్యానా మినహా ఇతర రాష్ట్రాల్లో ఆందోళన సందర్భంగా రైతులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు కొన్ని కేసుల పాక్షిక ఉపసంహరణ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసుల్లో ఏమీ చర్యలు తీసుకోలేదనీ అన్నారు. మార్చి 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతిస్తోందని, దేశవ్యాప్తంగా రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండీ ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, భారత ప్రజాతంత్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News