హైదరాబాద్లో బయటపడిన తొలి కేసు
దుబాయ్లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్
ఢిల్లీ, రాజస్థాన్లలో మరి రెండు కేసులు నమోదు
బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న 24 ఏళ్ల హైదరాబాదీ
15న దుబాయ్కి వెళ్లి నాలుగు రోజులు విధి నిర్వహణ
ఎప్పటికీ తగ్గని జ్వరంతో నగరానికి రాక
ఆయనతో బస్సులో వచ్చిన వారితో సహా 80 మందిపై నిఘా
నాకు సోకలేదు : సునీతా కృష్ణన్
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు చికిత్స అందిస్తున్నాం, ఇతరులకు సోకకుండా అన్ని ఏర్పాట్లు చేశాం : రాష్ట్ర వైద్యాధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్19(కరోనా) పాజిటివ్ కేసు కలకలం రేకేత్తిస్తుంది. దాదాపు 70 దేశాలను వణికిస్తున్న కొవిడ్19 వైరస్ తెలంగాణకి కూడా వ్యాప్తి చెందింది. దేశంలో సోమవారం రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెల ంగాణలో తొలి కేసు హైదరాబాద్ నగరంలో నమోదైంది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరొక వ్యక్తికి కొవిడ్19 సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దీంతో దేశ వ్యాప్తంగా 21 ప్రధాన విమానాశ్రయాల్లో, 12 ముఖ్యమైన ఓడరేవుల్లో, 65 చిన్న తరహ ఓడరేవుల్లో ప్రయాణికులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సోమవారం సాయంత్రం వరకు విమానాశ్రయాల్లో సుమారు 5,57,431 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని, 12,431 మందికి ఓడరేవుల్లో వైద్య పరీక్షలు చేపట్టామని కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చైనా, ఇరాన్, సింగపూర్, కొరియా, ఇటలీ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు సూచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగికి కొవిడ్19
హైదరాబాద్ నగరానికి చెందిన 24 ఏళ్ల ఓ యువకుడు బెంగళూరు పట్టణంలో ఓ ఐటి కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 15న కంపెనీ పని నిమిత్తం అతను దుబాయ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్లో దాదాపు నాలుగు రోజుల పాటు ఇతర దేశాల వ్యక్తులతో కలసి పనిచేశాడు. అనంతరం తిరిగి ఫిబ్రవరి 20న దుబాయ్ నుంచి బెంగళూరుకు ప్లైట్లో చేరుకున్నాడు. జ్వరం రావడంతో 22వ తేది బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్కు చేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు.
డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు మార్చి 1వ తేది సాయంత్రం 5 గంటలకు గాంధీ ఆసుపత్రికి చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. మరోసారి నిర్థారణ కోసం ఆ రిపోర్టును గాంధీ వైద్యులు పూణేకి పంపారు. అక్కడ కూడా పాజిటివ్ రావడంతో రాష్ట్ర వైద్యాధికారులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కేంద్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పేషెంట్కి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, అంతేగాక ఇతరులకు సోకకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను చికిత్స పొందుతున్న ఐసోలేటెడ్ వార్డులో ఎవరిని అనుమతించడం లేదని వైద్యాధికారులు తెలిపారు.
80 మందిపై నజర్
బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కొవిడ్19 సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిశాడు?ఎక్కడెక్కడ తిరిగాడు? వంటి అంశాలను గుర్తించే పనిలో రాష్ట్ర వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. అయితే ముందుగా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన బస్సులోని 27 మంది, అపోలో ఆసుపత్రిలో చికిత్స సందర్భంగా అతడిని కలసిన 23 మంది సిబ్బందితో పాటు అతని కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం దాదాపు 80 మందిపై నజర్ పెట్టినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ఆందోళనలో ప్రజలు
హైదరాబాద్లో కొవిడ్ 19 పాజిటివ్ కేసు నమోదు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చిన్నపాటి జ్వరం ప్రజలకు గుబులు పట్టుకుంది. అయితే ఎలాంటి భయాందోళనకు గురికావోద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.
పరీక్షలు చేయించుకున్నా.. రిపోర్టులు రాలేదు
-కరోనాపై సునీతా కృష్ణన్
తనకు కొవిడ్19 వైరస్ సోకలేదని ప్రముఖ ఎన్జిఒ సునిత క్రిష్ణన్ ట్విట్టర్లో తెలిపారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు అసత్యాలని ఆమె తన ట్వీట్లో కొట్టిపరేశారు. బ్యాంకాంగ్ నుంచి తిరిగి వచ్చాక చిన్నపాటి దగ్గు రావడంతో గాంధీ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో టెస్టులు చేయించుకున్నానని, కానీ రిపోర్టులు రావటానికి ఆలస్యమవడంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం దారుణమని ట్వీట్లో పేర్కొన్నారు.