Sunday, April 28, 2024

భారత్‌లో కరోనా సోకిన తొలి వ్యక్తికి మళ్లీ కరోనా

- Advertisement -
- Advertisement -

first indian infected with coronavirus now tests positive

న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ 19 సోకిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కిన కేరళ మహిళకు మళ్లీ కరోనా వైరస్ సోకింది. యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఆర్‌టిపీసీఆర్‌లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని కేరళ త్రిస్సూర్ జిల్లా వై ద్యాధికారి డాక్టర్ కేకే రీనా వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లడానికి ప్రయత్నించే సమయంలో ఆమె నమూనాలను పరీక్షించగా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం ఆమె తన ఇంటి లోనే ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్ బయటపడింది. భారత్‌లో మాత్రం 2020 జనవరి 30 న మొదటి కేసు నమోదైంది. వుహాన్ యానివర్శిటీలో చదువుతోన్న కేరళకు చెందిన మెడికల్ విద్యార్థిని సెమిస్టర్ సెలవుల్లో భారత్‌కు రాగా, అస్వస్థతకు గురి కావడంతో ఆమెకు వైద్య పరీక్షలు చేశారు.

కొవిడ్ నిర్ధారణ అయింది. మూడు వారాల పాటు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత రెండు సార్లు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమె పూర్తిగా కోలుకున్నట్టు భావించి ఆస్పత్రి నుంచి 2020 ఫిబ్రవరి 20 న డిశ్చార్జి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె కరోనా వైరస్ బారిన పడడం గమనార్హం. భారత్‌తోపాటు అనేక దేశాల్లో రెండోసారి కరోనా బారిన పడే కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్ వస్తే దాన్ని రీ ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ఇదివరకే నిర్ణయించింది. అయితే ఇటీవల కాలంలో ఒకసారి నెగిటివ్ వచ్చి మళ్లీ పాజిటివ్ వస్తేనే రీఇన్‌ఫెక్షన్‌గా గుర్తిస్తున్నారు. అమెరికాలో వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం (సీడీసి) ప్రకారం ఓ వ్యక్తికి 90 రోజుల తరువాత మళ్లీ పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్ ద్వారా రీఇన్‌ఫెక్షన్‌ను గుర్తించాలని సూచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News