న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయించారు. అంతేకాక నైపుణ్యాభివృద్ధికి మరో రూ. 3,000 కోట్లు కేటాయించారు. ఆర్థిక ప్రగతికి సంబంధించి అనేక చర్యలను ప్రకటించిన ఆమె యువ ఇంజనీర్లకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడానికి పట్టణ స్థానిక సంస్థల కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రతిపాదించారు. విద్యారంగం కోసం ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకాలు:
ఒక జాతీయ పోలీసు యూనివర్సిటీ, ఒక జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
జాతీయ స్థాయిలోని 100 అత్యున్నత విద్యాసంస్థల ద్వారా డిగ్రీ స్థాయిలో పూర్తికాలం ఆన్లైన్ విద్యా కార్యక్రమం.
మార్చి 2021లో 150 ఉన్నత విద్యా సంస్థలలో అప్రెంటిస్షిప్ కార్యక్రమాలు.
యువ ఇంజనీర్లు తమ ఉద్యోగ విధుల గురించి తెలుసుకునేందుకు వీలుగా వారికి పట్టణ స్థానిక సంస్థలు ఒక ఏడాదిపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
త్వరలోనే కొత్త విద్యా విధానంపై ప్రకటన. దీని కోసం ప్రభుత్వానికి రెండు లక్షలకు పైగా సూచనలు అందాయి.
టీచర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య సహాయక సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన స్వల్పకాలిక కోర్సులు.
FM announces new initiatives for education sector