ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్థకోర్లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింస, 2002లో గుజరాత్లో ముస్లింలపై జరిగిన హింసపై నానావతి నేతృత్వంలోని కమిషన్ దర్యాప్తు జరిపింది. ఈ రెండు సంఘటనలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నది గమనార్హం. నానావతి గుజరాత్లోని భరూచ్జిల్లా జంబూసర్లో 1935, ఫిబ్రవరి17న జన్మించారు. బాంబే హైకోర్టులో 1958లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1979లో గుజరాత్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 1994లో ఒడిషా చీఫ్జస్టిస్గా పదోన్నతి పొందారు.
1995లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులై 2000 ఫిబ్రవరి 16న రిటైర్ అయ్యారు. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింసపై దర్యాప్తునకు వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం 2000లో నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు నానావతి నేతృత్వంలో ద్విసభ్య కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ అల్లర్లలో 1000మందికిపైగా చనిపోగా,అధికభాగం ముస్లింలేనన్నది గమనార్హం. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీ ఉన్నారు. ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభం కావడానికి ముందు గోద్రా రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్లో వెళ్తున్న కరసేవకుల(హిందువుల) సజీవ దహనం జరిగింది. 59మంది కరసేవకులు ఆ సంఘటనలో మరణించారు.