ముంబై : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకీ పసిడి ధరలు పరుగులు తీస్తూ సామాన్య ప్రజలకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్కు చేరువ అయ్యింది. రూ.251 తక్కువగా ఉన్నప్పటికీ మానసికంగా రూ.50 వేలు చేరుకుందనే భావించాలి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 3 శాతం జిఎస్టితో కలిపి రూ.49,749 వద్ద ఉంది. అయితే హైదరాబాద్లో మాత్రం 10 గ్రాముల పసిడి ధర రూ.50వేలు దాటింది. ఇక్కడ (22 క్యారెట్) రూ.46,290, 24 క్యారెట్ ధర రూ.50,580కు చేరింది.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ వృద్ధి రేటు పడిపోనుందనే ఆందోళనలు, కోవిడ్19 కేసులు పెరగడం వల్ల పెట్టుబడులకు పసిడి సురక్షితమైనదిగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేటు ఔన్స్ 1753 డాలర్లతో తాజాగా గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉండే భారత్లో డిమాండ్ ఇంకా పెరగాల్సి ఉంది, కానీ కరోనా సంక్షోభం వల్ల కొనుగోలుదారుల్లో ఆదాయం తగ్గడం, ఇతర ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. వచ్చే మూడు నెలల్లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్ను దాటి మరింతగా పెరగనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.