ఐఐటి మండి పరిశోధకుల నూతన సాంకేతిక ప్రక్రియ
న్యూఢిల్లీ : వృధా ప్లాస్టిక్ బాటిల్స్తో అధిక సామర్ధ్యం కలిగిన మాస్క్లను తయారు చేసే సాంకేతిక ప్రక్రియను ఐఐటి మండీ పరిశోధకులు కనుగొన గలిగారు. మార్కెట్లో లభించే మాస్క్ల కన్నా ఎక్కువ శ్వాస తీసుకోడానికి, దాదాపు 30 సార్లు ఉతికి శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి ఇవి వీలవుతాయి. ఈ పరిశోధకులు ఎలెక్ట్రో స్పిన్నింగ్ ఆధారంగా వృధా ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి ఉత్పన్నమయ్యే ఫిల్టర్ మెంబ్రేన్ టెక్నాలజీపై పేటెంట్ హక్కును దాఖలు చేశారు. వృధా ప్లాస్టిక్ బాటిల్స్ను వీరు తునకలు చేసి ద్రావకాలు, సింథటిక్ ఫైబర్ మిశ్రమ ద్రావణంలో కరిగించారు. దాని నుంచి పలుచని సింధటిక్ పొరను తయారు చేయగలిగారు.
ఈ పొర అనుకున్న విధంగా కణాల వడపోత చేయగలిగే సామర్థం సంతరించుకుంది. ఎన్ 85 రెస్పిరేటర్, మెడికల్ మాస్క్తో సమానంగా దీని సామర్థం చూపించగలిగింది. వీటిని వినియోగించే వారికి బ్యాక్టీరియా కానీ అంటువ్యాధి కారకాలు కానీ సోకకుండా భద్రతా అవసరాలను నెరవేర్చగలుగుతోంది. ప్రయోగశాల స్థాయిలో ఈ మాస్క్ ఒక్కొక్కటి రూ.25 వంతున ధర పలుకుతుండగా, మార్కెట్కు వస్తే సగానికి సగం ధర తగ్గుతుందని, ఈ మాస్క్ను 30 సార్లు శుభ్రం చేసి తిరిగి వాడుకోవచ్చని ఐఐటి మండి అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమిత్ సిన్హారే చెప్పారు. ఎలాంటి సూక్ష్మ కణాలైనా ఇవి వడపోయ కలుగుతాయని, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలిగేలా ఉంటాయని చెప్పారు.