కోల్కతా: ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆట వస్తువులు (టాయ్స్)పై దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న రిటైలర్స్పై నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బొమ్మల దిగుమతిపై సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతంనుంచి 60 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. స్థానికంగా బొమ్మల తయారీదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కేంద్రం నిర్ణయంపై టాయ్స్ విక్రేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో హోల్సేల్గా బొమ్మలను విక్రయించే వారు శనివారం ఒక రోజు సమ్మె చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యాపారాలు మూతపడ్డంతో పాటుగా నిరుద్యోగం పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘బొమ్మలపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచడం నిజంగా దారుణమైన నిర్ణయం.
ప్రజలు ఆ ధరలకు బొమ్మలను కొనలేరు. ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం పన్నును యథాతథంగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆందోళనను తెలియజేయడం కోసం శనివారం ఒక రోజు సమ్మె చేస్తున్నాం’ అని పశ్చిమ బెంగాల్ ఎగ్జిమ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మొహిత్ భంతియా చెప్పారు.
సమ్మె కారణంగా నగరంలోని కానింగ్ స్ట్రీట్లో బొమ్మల హోల్సేల్ మార్కెట్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆదివారం నగరానికి రానున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలవాలని బొమ్మల దిగుమతిదారులు, రిటైల్ వ్యాపారులు అనుకుంటున్నారు. దేశం ఏటా రూ.2500 కోట్ల విలువైన బొమ్మలను దిగుమతి చేసుకుంటుండగా, అందులో దాదాపు 70 శాతం బొమ్మలు చైనానుంచి దిగుమతి అయ్యేవే.