Monday, April 29, 2024

నకిలీ మందులపై కేంద్ర ప్రభుత్వ జీరోటాలెరెన్స్ విధానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నకిలీ మందులపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. భారత్‌లో తయారైన అనేక దగ్గు సిరప్‌ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో 71 కంపెనీలకు నకిలీ మందుల తయారీకి సంబంధించి షోకాజ్ నోటీస్‌లు జారీ చేసినట్టు , ఇందులో 18 కంపెనీలను మూసివేయాలని ఆదేశించినట్టు చెప్పారు.

పిటిఐ వీడియోలో ప్రత్యేక ఇంటర్వూ సందర్భంగా మాండవీయ మాట్లాడారు. దేశంలో నాణ్యమైన ఔషధాల ఉత్పత్తిని నిర్ధారించడానికి కాంప్రహెన్సివ్ రిస్క్ బేస్డ్ విశ్లేషణ నిరంతరం జరుగుతుందని వివరించారు. నకిలీ మందుల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్న లక్షంతో ప్రభుత్వం, నియంత్రణ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచానికి నాణ్యమైన ఫార్మాసిటీ భారత్ అయినందున ప్రతివారికి తాము ఈ విషయంలో భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ఫిబ్రవరిలో తమిళనాడు లోని గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తాము సరఫరా చేసే కంటిచుక్కల మందు మొత్తం వెనక్కు రప్పించుకుంది.

అంతకు ముందు గత ఏడాది గాంబియాలో 66 మంది చిన్నారులు, ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మరణించడానికి భారత్‌లో తయారైన దగ్గు సిరప్ కారణమని ఆరోపణలు వచ్చాయి. 202122 లో భారత్ 17 బిలియన్ డాలర్ల విలువైన , 202223లో 17.6 బిలియన్ డాలర్ల విలువైన దగ్గు సిరప్ మందులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జనరిక్ ఔషధాల సరఫరా దారైన భారత్ ప్రపంచ డిమాండ్‌లో 50 శాతం పైగా టీకాలను సరఫరా చేస్తోంది. భారతీయ తయారీ మందులపై ప్రశ్నలు తలెత్తడంతో వాస్తవాలు తెలుసుకోడానికి ప్రయత్నించామని, గాంబియాలో పిల్లల మృతికి భారత్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గు మందు కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ గతంలో తెలిపిందన్నారు.

దీనిపై వాస్తవాల కోసం లేఖ రాయగా, దానికి బదులు రాలేదని తెలిపారు. ఆ కంపెనీకి చెందిన శాంపిల్స్ పరిశీలించామని, మృతికి కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా, చిన్నారికి డయేరియా సోకినట్టు గుర్తించామన్నారు. డయేరియా ఉన్న పిల్లలకు దగ్గుమందు సిరప్ ఎవరు సిఫారసు చేశారు ? అని ప్రశ్నించారు. 24 శాంపిల్స్ తీసుకోగా, అందులో నాలుగు ఫెయిలయ్యాయని మంత్రి తెలిపారు. జూన్ 1 నుంచి దగ్గు సిరప్‌లకు పరీక్షలు తప్పనిసరి విధానాన్ని అమలు చేస్తున్నారు. దగ్గుసిరప్ ఎగుమతి దారులు వాటిని ఎగుమతి చేసే ముందు ప్రభుత్వ లేబొరేటరీ పరీక్ష చేసినట్టు సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News